చెక్‌బుక్కులపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

SBI

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ మహిళా బ్యాంకుతో సహా ఎస్‌బీహెచ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ తదితర అనుబంధ బ్యాంకులు జారీచేసిన చెక్కులేవీ సెప్టెంబర్‌ 30 తర్వాత చెల్లబోవంటూ జారీచేసిన ఆదేశాలపై స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వెనక్కి తగ్గింది. అసోసియేట్‌ బ్యాంకుల చెక్కుల వాలిడిటీని 2017 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తున్నట్టు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అప్పటి వరకు కొత్త ఎస్‌బీఐ చెక్‌ బుక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

హోమ్‌ బ్రాంచ్‌ను సందర్శించి లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం ద్వారా కొత్త చెక్‌ బుక్కులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఎస్‌బీఐ విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్‌ బుక్కులు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు సెప్టెంబర్‌ 30 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త వాటికే అనుమతిస్తామని ఎస్‌బీఐ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుడేటెడ్‌ చెక్కులు తీసుకున్న వారి పరిస్థితి దారుణంగా మారడంతో, ఎస్‌బీఐ ఈ నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గింది. ఆ గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top