
స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో అగ్రస్థానం
దేశంలో స్మార్ట్ఫోన్ మార్కెట్లో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్టు శాంసంగ్ తెలిపింది...
40% వాటాతో ముందంజ
- శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ మార్కెట్లో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్టు శాంసంగ్ తెలిపింది. ఏడాది ప్రారంభంలో ఈ వాటా 35 శాతమని శాంసంగ్ ఇండియా ఐటీ, మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి గురువారం తెలిపారు. గెలాక్సీ ఏ8ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మొబైల్ బిజినెస్ డెరైక్టర్ మను శర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొత్తంగా భారత మొబైల్ ఫోన్ రంగంలో 39 శాతం వాటాతో తొలి స్థానాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలిపి 16 మోడళ్లను విడుదల చేశామన్నారు. మార్కెట్కు అనుగుణంగా మోడళ్లను ప్రవేశపెడుతున్నామని, రానున్న రోజుల్లో కూడా దీనిని కొనసాగిస్తామని వివరించారు. ఇక 4జీలో అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టిన ఘనత తమదేనన్నారు. 14 మోడళ్లతో ముందంజలో ఉన్నట్టు తెలిపారు.
భారత్లోనే తయారీ..: బేసిక్ మోడళ్లతోపాటు ప్రీమియం ఫోన్లనూ నోయిడా ప్లాంటులో తయారు చేస్తున్నట్టు ఆసిమ్ వార్సి తెలిపారు. ఎస్6 ఎడ్జ్, గెలాక్సీ ఏ8ను సైతం నోయిడా ప్లాంటులో తయారు చేశామన్నారు. టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్తో తయారైన శాంసంగ్ జడ్1 మోడల్ 150 రోజుల్లో 10 లక్షలకుపైగా మొబైల్స్ విక్రయించామని చెప్పారు. మొబైల్స్ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 28%.