ఎన్నికల తర్వాత భారీగా పెట్రో షాక్‌.. | Sharp Fuel Price Hike After Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత భారీగా పెట్రో షాక్‌..

Apr 24 2019 7:50 PM | Updated on Apr 25 2019 2:29 PM

Sharp Fuel Price Hike After Elections - Sakshi

ఎన్నికల తర్వాత పెట్రో షాక్‌లు..

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తర్వాత జనం చేతి చమురు వదిలించేలా చమురు కంపెనీలు భారీగా పెట్రో ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమనడం, చమరు సరఫరాల్లో ఒపెక్‌ కోతలు విధించడంతో పాటు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులపై భారత్‌ సహా పలు దేశాలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రో ధరలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు.

మే 2 నుంచి అమెరికా తాజా ఉత్తర్వుల ప్రకారం ఇరాన్‌ నుంచి చమరు దిగుమతులు నిలిచిపోవడంతో పాటు ట్రంప్‌ వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, ఈ పరిణామం చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలపై పెను ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎన్నికల కారణంగా పెట్రో ధరల పెంచకుండా చమురు మార్కెటింగ్‌ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తున్నా మే 23 ఓట్ల లెక్కింపు అనంతరం భారీ వడ్డనకు చమురు కంపెనీలు సన్నద్ధమవుతాయని చెబుతున్నారు. ఎన్నికల అనంతరం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సంకేతాలు పంపాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మార్చి తొలి వారం నుంచీ భారమవుతున్నా ఎన్నికల వేళ పెట్రో ధరల పెంపునకు కేంద్రం అనుమతించకపోవడంతో ఇంధన విక్రయాలపై భారీగా నష్టపోతున్నట్టు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వాపోతున్నాయి. ఇక మే19న తుది విడత పోలింగ్‌ ముగిసిన తర్వాత పెట్రో షాక్‌లకు చమురు కంపెనీలు సిద్ధంగా ఉండటంతో ఏ రేంజ్‌లో పెట్రో షాక్‌లు ఉంటాయా అని వాహనదారుల్లో గుబులు మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement