మార్కెట్‌కు ప్యాకేజీ జోష్‌..

Sensex posts biggest one-day gain in 3 months - Sakshi

ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌

అగ్రరాజ్యాల పరస్పర సుంకాల పోరుతో నష్టాలు

వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు మళ్లీ షురూ కానున్న చర్చలు

దీంతో మళ్లీ లాభాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీలు

793 పాయింట్ల లాభంతో 37,494కు సెన్సెక్స్‌

229 పాయింట్లు పెరిగి 11,058కు నిఫ్టీ

మందగమనంలో ఉన్న వృద్ధికి జోష్‌నివ్వడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య తాజాగా చర్చలు ప్రారంభం కానున్నాయన్న వార్తలు మధ్యాహ్నం తర్వాత వెలువడ్డాయి. దీంతో కొనుగోళ్లు మరింత జోరుగా సాగాయి. సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్లపైకి ఎగబాకాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 793 పాయింట్లు పెరిగి 37,494 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 11,058  పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పెరగడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి. ఆసియాలోని ప్రధాన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 3 శాతం మేర పతనమైనా, మన స్టాక్‌ సూచీలు 2 శాతం మేర లాభపడటం విశేషం.  

భారీ లాభాలతో బోణి...
మందగమనం నుంచి మరింత వృద్ధి దిశకు ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి కొన్ని చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ చర్యలే కాకుండా సరైన సమయంలో మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఆమె అభయం ఇచ్చారు. ఇక అమెరికా–చైనాలు పరస్పరం సుంకాలు విధించుకున్న నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నా, ప్యాకేజీ జోష్‌తో మన మార్కెట్‌ మాత్రం భారీ లాభాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్‌ 663 పాయింట్లు, నిఫ్టీ 171  పాయింట్ల లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

వెంటనే సెన్సెక్స్‌ 843 పాయింట్లు, నిఫ్టీ 259  పాయింట్ల లాభాలను తాకాయి. కానీ ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా ఈ లాభాలన్నీ ఆవిరై సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో  208 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల మేర నష్టపోయాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయన్న వార్తలతో స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌1,051 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోగా, యూరప్‌ మార్కె ట్లు లాభాల్లో ముగిశాయి.  

మరిన్ని విశేషాలు....
► యస్‌ బ్యాంక్‌ షేర్‌ 6.3 శాతం పెరిగి రూ.63 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  
► స్టాక్‌ మార్కెట్‌ లాభాల కారణంగా   పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. బాటా ఇండియా, ఫోర్స్‌ మోటార్స్, జీఎస్‌కే కన్సూమర్‌ ఈ జాబితాలో ఉన్నాయి. మరో వైపు అలోక్‌ ఇండస్ట్రీస్, అబన్‌ ఆఫ్‌షోర్, డీబీ రియల్టీ, సీజీ పవర్, ఈక్లర్క్స్‌ సర్వీసెస్, ఖదిమ్‌ ఇండియా వంటి 180కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.  

బ్యాంక్, హెచ్‌ఎఫ్‌సీ  షేర్ల జోరు
మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదుకోవడానికి తాజాగా రూ.70,000 కోట్ల మూలధన నిధులందించగలమని కేంద్రం ఆభయం ఇవ్వడంతో బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి.  ఈ నిధుల కారణంగా రూ.5 లక్షల కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందని అంచనా. ఫలితంగా మరిన్ని రుణాలు అందుబాటులోకి వచ్చి, వ్యవస్థలో లిక్విడిటీ సమస్య ఒకింత తీరగలదన్న అంచనాలతో బ్యాంక్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 10 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 8 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 6 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3.6 శాతం, ఎస్‌బీఐ 3 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 3..4 శాతం, కెనరా బ్యాంక్‌ 3.3 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.7 శాతం  చొప్పున లాభపడ్డాయి. బ్యాంక్‌ షేర్లతో పాటు హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు కూడా జోరుగా పెరిగాయి. హెచ్‌ఎఫ్‌సీలకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) రూ.20,000 కోట్ల మేర నిధులు అందజేయనున్నది. ఈ నిర్ణయం కారణంగా హెచ్‌ఎఫ్‌సీలు లాభపడ్డాయి. ఎమ్‌ అండ్‌ ఎమ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 4 శాతం, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌3 శాతం మేర ఎగిశాయి.

లాభాలు ఎందుకంటే...
► ఎట్టకేలకు ఉద్దీపన ప్యాకేజీ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై విధించిన సూపర్‌ రిచ్‌ సర్‌చార్జీని రద్దు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ప్రకటించారు. అంతేకాకుండా వాహన రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలను, బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మూలధన నిధుల అందించడం, తదితర నిర్ణయాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.  
► మళ్లీ అమెరికా–చైనాల చర్చలు....
అమెరికా–చైనాలు తాజాగా పరస్పరం సుంకాలు విధించుకున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం మళ్లీ చర్చలు ఆరంభం కాగలవని అమెరికా అధ్యక్షుడు ట్వీట్‌ చేయడం మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది.  
► చల్లబడ్డ చమురు ధరలు...
చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్, నైమెక్స్‌ ముడి చమురు ధరలు దాదాపు 1 శాతం మేర తగ్గాయి.  
► ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం...
ఆర్‌బీఐ మిగులు నిధులపై అధ్యయనం చేసిన బిమల్‌ జలాన్‌ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించడానికి సోమవారం ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశమైంది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినప్పటికీ, సానుకూల నిర్ణయం ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్‌కు కలసివచ్చాయి.  
► పెరిగిన రేటింగ్‌
అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, నొముర.. భారత్‌ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్‌’కు అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రపంపవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, దేశీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో భారత్‌ రేటింగ్‌ను నొముర అప్‌గ్రేడ్‌ చేసింది. మరోవైపు  ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 40,500 పాయింట్లకు చేరగలదని మరో బ్రోకరేజ్‌ సంస్థ, బీఎన్‌పీ పారిబా వెల్లడించడం కూడా సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపించింది.  
► షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు...
ఆగస్టు  సిరీస్‌ డెరివేటివ్స్‌(ఫ్యూచర్స్‌ అండ్‌  ఆప్షన్స్‌) కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనున్న నేపథ్యంలో సానుకూల ప్యాకేజీ కారణంగా షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయని నిపుణులంటున్నారు.

ఆ మూడు షేర్ల వల్లే భారీ లాభాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ మూడు షేర్లు 4–5 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. సెన్సెక్స్‌ మొత్తం లాభంలో ఈ మూడు షేర్ల వాటాయే 61 శాతంగా  ఉండటం విశేషం. మొత్తం 793 పాయింట్ల సెన్సెక్స్‌ లాభంలో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 195 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటా 180 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటా 102 పాయింట్లుగా ఉన్నాయి. వెరసి ఈ 3 షేర్ల వాటా 477 పాయింట్లుగా ఉంది.

ఇన్వెస్టర్ల సంపద 2.41 లక్షల కోట్లు అప్‌
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.41 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ విలువ రూ.2.41 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,33,462 కోట్లకు పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top