
పనాజి: వాహన తయారీ కంపెనీ ‘రెనో ఇండియా’ తాజాగా తన ప్రముఖ ప్రీమియం ఎస్యూవీ ‘కాప్చర్’ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.15 లక్షలలోపు ఉండొచ్చని అంచనా. ఇది దీపావళి పండుగకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయంగా పది లక్షలకు పైగా కాప్చర్ వాహనాలను విక్రయించింది. ఇది జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్యూవీ, టాటా హెక్జా వంటి పలు మోడళ్లకు గట్టిపోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ ప్రీమియం ఎస్యూవీ అయిన కాప్చర్ ధర డస్టర్ కన్నా ఎక్కువగానే ఉంటుందని రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమిత్ సాహ్ని తెలిపారు. ఇది పెట్రోల్, డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రెనో షోరూమ్లలో కాప్చర్ బుకింగ్స్ను ప్రారంభించామని తెలిపారు. కాగా రెనో ఇండియా కేవలం క్విడ్, డస్టర్ మోడళ్లను మాత్రమే భారత్లో విక్రయిస్తోంది.