మహారాష్ట్రలో టయోటా భారీ ప్లాంట్ | Toyota Expands in India Maharashtra Plant to Produce 100000 SUVs Annually | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో టయోటా భారీ ప్లాంట్

May 11 2026 2:40 PM | Updated on May 11 2026 2:43 PM

Toyota Expands in India Maharashtra Plant to Produce 100000 SUVs Annually

2029 నుంచి ఉత్పత్తి ప్రారంభం!

ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ భారత్‌లో తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా ఒక అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. సుమారు 1,00,000 వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ప్లాంట్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పించనుందని కంపెనీ తెలిపింది.

ముఖ్య విశేషాలు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో ఉన్న బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

  • దీని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి ఒక లక్ష వాహనాలు.

  • ప్రత్యక్షంగా ఈ ప్లాంట్‌ ద్వారా సుమారు 2,800 మందికి ఉపాధి లభించనుంది.

  • 2029 మొదటి అర్ధభాగం నాటికి ఈ ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

కొత్త ఎస్‌యూవీ మోడల్‌పై దృష్టి

టయోటా ఈ ప్లాంట్‌లో ప్రధానంగా సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లను తయారు చేయనుంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎస్‌యూవీలకు ఉన్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాహనాలను ఇక్కడ రూపొందించనున్నారు. ఇది దేశీయ అవసరాలతోపాటు ఎగుమతులకు కూడా కేంద్రంగా మారే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రగతికి ఊతం

మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం, ఈ పెట్టుబడి రాష్ట్ర ఆటోమొబైల్ హబ్‌గా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటికే బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతం మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుండగా టయోటా రాకతో మరిన్ని అనుబంధ పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరే అవకాశం ఉంది. ‘భారతదేశంలో మా మూడో ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం సంతోషంగా ఉంది. 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇది కేవలం వాహనాల తయారీ మాత్రమే కాదు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి రంగానికి పెద్ద పీట వేయడమే మా ఉద్దేశం’ అని టయోటా ప్రతినిధి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement