నాణ్యమైన నిర్మాణాలకే ప్రాధాన్యం

Property Portal Survey - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక సదుపాయాలు లేకపోయినా ఫర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లమ్‌. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్‌ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని సూచించింది.

మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థ్ధిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణ ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందు బాటు ఇళ్లకు శ్రీకారం చుట్టాయి.

♦  నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్‌ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ హైదరాబాద్‌ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top