ఒక్కసారిగా దిగొచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు | Petrol, Diesel Prices Drop Sharply Today | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా దిగొచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oct 4 2017 11:04 AM | Updated on Sep 28 2018 3:22 PM

 Petrol, Diesel Prices Drop Sharply Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీసుకున్న ఎక్సైజ్‌ సుంకం కోత నిర్ణయంతో ఒక్కసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కిందకి దిగొచ్చాయి. రోజువారీ సమీక్ష నేపథ్యంలో బుధవారం ఉదయం ఆరుగంటలకు జరిపిన సమీక్షలో ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.2.25, కోల్‌కత్తాలో రూ.2.25, ముంబైలో రూ.2.38, చెన్నైలో రూ.2.41 తగ్గినట్టు తెలిసింది. దీంతో నేటి రిటైల్‌లో లీటరు డీజిల్‌ ధరలు ఢిల్లీలో రూ.56.89గా, కోల్‌కత్తాలో రూ.59.55గా, ముంబైలో రూ.60.43గా, చెన్నైలో రూ.59.89గా నమోదయ్యాయి. ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌లో ఈ విషయం వెల్లడైంది. అదేవిధంగా పెట్రోల్‌ ధరలు కూడా తగ్గిన్నట్టు ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌ డేటాలో తేలింది. ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబైలలో లీటరు పెట్రోల్‌ ధర రూ.2.5 తగ్గినట్టు వెల్లడైంది.

అదేవిధంగా చెన్నైలో ఈ తగ్గింపు రూ.2.6గా ఉంది. దీంతో నేటి రిటైల్‌లో లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.68.38గా, కోల్‌కత్తాలో రూ.71.16గా, ముంబైలో రూ.77.51గా, చెన్నైలో రూ.70.85గా నమోదయ్యాయి. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్స్చేంజ్‌ సుంకం తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 ఎక్సైజ్‌ సుంకాన్ని వసూలు చేస్తున్నారు. తగ్గింపు అనంతరం ఈ సుంకాలు వరుసగా రూ.19.48, రూ.15.33గా ఉంటాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement