
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనా ప్రమాణాలను పటిష్టపరచడం, రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం, దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం వంటి లక్ష్యాలుగా కేంద్రం రూపొందించిన కంపెనీల చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. వర్షకాల సమావేశాల్లో ఇదే బిల్లుకు లోక్సభ ఆమోదం లభించినందున చట్టరూపం దాల్చనుంది. గత యూపీఏ సర్కారు తీసుకొచ్చిన కంపెనీల చట్టం, 2013లో మోదీ సర్కారు దాదాపు 40కు పైగా సవరణలను ప్రతిపాదించింది.
ఇదే చట్టంలో మోదీ సర్కారు లోగడ కూడా ఓ సారి సవరణలు చేయడం గమనార్హం. బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి సమాధానం ఇచ్చారు. తాజా సవరణలతో దేశంలో కార్పొరేట్ పరిపాలన మెరుగ్గా మారుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ప్రక్రియలు, నిబంధనల అమలు సులభంగా మారుతుందన్నారు. కంపెనీలు తమ లాభాల్లోంచి నిర్ణీత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిబంధనలు (సీఎస్ఆర్) పాటించని కంపెనీలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు చెప్పారు.