
డబ్బు చెల్లించకపోతే జైలు శిక్ష
కోర్టు ధిక్కారం కేసులో నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ డెరైక్టర్ కె.ఎస్.రాజును సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది.
ఎన్ఎఫ్ఎల్ కేసులో కె.ఎస్.రాజుకు కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారం కేసులో నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ డెరైక్టర్ కె.ఎస్.రాజును సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఏడుపుగంటి బాపనయ్య అనే ఇన్వెస్టరుకు డిపాజిట్ వెనక్కి ఇవ్వాలన్న కంపెనీ లా బోర్డు(సీఎల్బీ) ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించనందుకు కోర్టు ఆయనను దోషిగా గుర్తిం చింది. 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. 60 రోజుల్లో బాధితుడికి రూ.40 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో కె.ఎస్.రాజుకు ఆరు నెలల జైలు శిక్ష తప్పదని జస్టిస్ విక్రమజిత్ సేన్, ప్రఫుల్ల సి పంత్ల బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఎఫ్ఎల్లో 1997లో రూ.4 లక్షలను బాపనయ్య డిపాజిట్ చేశారు.
45 నెలల్లో రెట్టింపు సొమ్ము ఇస్తామని కంపెనీ నమ్మబలికింది. డబ్బు వెనక్కి చెల్లిస్తానని కంపెనీ లా బోర్డుకు 2000 ఫిబ్రవరి 14న కె.ఎస్.రాజు వాగ్ధానం ఇచ్చి కూడా హామీని నిలబెట్టుకోలేదంటూ 2001లో బాధితుడు ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. కాగా, 2000 సెప్టెంబరులో కె.ఎస్.రాజు ఎన్ఎఫ్ఎల్కు రాజీనామా చేశారు. సీఎల్బీ ఆదేశాల నుంచి తప్పించుకోవడానికే ఆయన రాజీనామా చేశారంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్ఎఫ్ఎల్ను 2000 సెప్టెంబరులో మహాలక్ష్మి ఫ్యాక్టరింగ్ సర్వీసెస్కు విక్రయించారు.