
వేడిని దూరంచేసే పెయింట్
ప్రపంచవ్యాప్తంగా పేటెంటు హక్కులున్న ‘ఆడ్ గ్రీన్కోట్’ పెయింట్ భారత్లో అడుగుపెట్టింది. జపాన్కు చెందిన ఎన్సీకేతో హైదరాబాద్కు చెందిన సన్ షాడో టెక్నాలజీస్ చేతులు కలిపింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా పేటెంటు హక్కులున్న ‘ఆడ్ గ్రీన్కోట్’ పెయింట్ భారత్లో అడుగుపెట్టింది. జపాన్కు చెందిన ఎన్సీకేతో హైదరాబాద్కు చెందిన సన్ షాడో టెక్నాలజీస్ చేతులు కలిపింది. ఎన్సీకే ఉత్పత్తులను సన్ షాడో విక్రయిస్తుంది. నానో సిరామిక్తో రూపొందిన ఆడ్గ్రీన్కోట్ పెయింట్ను కాంక్రీట్, ఆస్బెస్టాస్, మెటల్, ప్లాస్టిక్పైన పూతలాగా వాడొచ్చు. ఈ పూత ఉన్న ఉపరితలంపై పడిన 97 శాతం సూర్యరశ్మి పరావర్తనం చెందుతుంది. అంటే భవనం లోపలికి వేడిని దాదాపు రానీయదు.
పలు దేశాల్లో ఆడ్గ్రీన్కోట్ టాప్ సెల్ల ర్గా ఉందని సన్ షాడో సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కె.రాజేశ్ గౌడ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. గది ఉష్ణోగ్రత 6 డిగ్రీల దాకా తగ్గుతుందని చెప్పారు. ఏసీలపై భారం తగ్గి విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తెలియజేశారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఈ కోట్ వాడిన ఉపరితలంపై పాదరక్షలు లేకుండా నడవొచ్చని చెప్పారాయన.అయిదేళ్ల వారంటీ..: ఒకసారి ఆడ్గ్రీన్కోట్ వేస్తే అయిదేళ్లకుపైగా మన్నుతుందని సేల్స్ మేనేజర్ సతీష్ తెలిపారు.
‘‘ఇతర ఉత్పాదనతో పోలిస్తే తక్కువ పరిమాణంతో ఎక్కువ విస్తీర్ణంలో పెయింట్ వేయొచ్చు. చదరపు అడుగుకు రూ.40–45 చార్జీ చేస్తాం. వాహనాలకు కూడా ఆడ్గ్రీన్కోట్ వాడొచ్చు. ప్రస్తుతం వాణిజ్య భవనాలు, ఫ్యాక్టరీలు లక్ష్యంగా సేవలను అందిస్తాం. పంపిణీదారులను నియమించాక రిటైల్లో విస్తరిస్తాం’’ అని వివరించారు. ప్రస్తుత సీజన్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెయింట్ వేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామని, ఇది పర్యావరణానికి అనుకూలమైన ఉత్పాదన అని వివరించారు.