శరీరంలోని ప్లాస్టిక్ రేణువుల పనిపడుతున్న దక్షిణ కొరియా వంటకం
తాజా అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేత్తలు
వాయు కాలుష్యం కారణంగా శరీరంలోకి చొచ్చుకుపోయి అవయవాల్లో తిష్టవేస్తున్న మైక్రో, నానో ప్లాస్టిక్ రేణువులను తరిమికొట్టడంలో దక్షిణ కొరియా పాపులర్ వంటకం కిమ్చి ఎంతగానో తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్లాస్టిక్ రేణువులను అదిమిపట్టి బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతకీ ప్లాస్టిక్ పనిపడుతున్న ఆ వంటకంలో ఉన్నది ఏమిటో తెలుసా? ప్రోబయోటిక్స్. అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అన్నమాట.
పులియబెట్టడంతో..
కిమ్చి అనేది దక్షిణ కొరియా సంప్రదాయ వంటకం. క్యాబేజీ, ముల్లంగి, ఇతర కూరగాయలను పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. కిమ్చిని పులియబెట్టడం వల్ల అందులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియాకు మైక్రో, నానో ప్లాస్టిక్ రేణువులను గట్టిగా అతుక్కునే గుణం ఉందని గుర్తించారు.
కిమ్చి వంటి ప్రో బయోటిక్స్తో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు అందులోని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉదరంలోకి చేరి నానో ప్లాస్టిక్స్కు అతుక్కుంటుంది. అనంతరం శరీర జీర్ణ ప్రక్రియలో భాగంగా ఆ బ్యాక్టీరియా ఆహారంలోని వ్యర్థాలతోపాటు నానో ప్లాస్టిక్స్తో సహా బయటకు విసర్జితం అవుతుంది. నానో ప్లాస్టిక్స్ శరరీ అవయవాల్లోకి చేరకుండా అడ్డుకోవాలంటే ఆ ప్లాస్టిక్ రేణువులు ఉదరం, పేగుల్లో ఉండగానే విసర్జితం అయ్యేలా చూడటమే ఉత్తమ మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎలుకలపై ప్రయోగాలతో..
ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం నిరూపితమైందన్నారు. ఎలుకలకు అందించిన ఆహారంలో ప్రో బయోటిక్ బ్యాక్టీరియా కలిపినప్పుడు వాటి విసర్జితాల్లో నానో ప్లాస్టిక్స్ ఆనవాళ్లు ఎక్కువ మొత్తంలో కనిపించాయని పేర్కొన్నారు. పులియబెట్టిన ఆహారం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని అధ్యయనం చేయడానికి దక్షిణ కొరియా జాతీయ ఆహార సంస్థ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిమ్చి పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అధ్యక్షుడు హే చూన్ చాంగ్ బృందం కిమ్చిలో పులియబెట్టిన ఆహారంపై పరిశోధన ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు వ్యవసాయ ఇంజనీరింగ్లో అగ్రస్థానంలో ఉన్న బయోరిసోర్స్ టెక్నాలజీ (ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 9.0) అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
అవయవాల్లోకి ప్లాస్టిక్ చేరితే..
నానో ప్లాస్టిక్స్ అనేవి ఒక మైక్రోమీటర్ (మిల్లీమీటర్లో వెయ్యోవంతు) పరిమాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కణాలు. పెద్ద ప్లాస్టిక్ పదార్థాలు కాలక్రమేణా విచ్ఛిన్నమవుతూ సూక్ష్మ పరిమాణంలో విభజితమవుతాయి. ఇవి మన ఆహారం, తాగునీటిలో సులువుగా కలిసిపోయి తినేటప్పుడు, తాగేటప్పుడు ఉదరంలోకి చేరిపోతాయి. ఈ ప్లాస్టిక్ రేణువులను అలాగే వదిలేస్తే క్రమంగా పేగుల్లోంచి మూత్రపిండాలు, మెదడుకు కూడా చేరి అక్కడే పేరుకుపోయి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


