9 శాతం వృద్ధి సవాలే: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8 నుంచి 9 శాతం సాధించడం కేంద్రం ముందు ఉన్న ఒక సవాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. వృద్ధి సాధన, అదే స్థాయిలో దానిని నిలబెట్టుకోవడం కీలకమని అన్నారు. ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన ఆర్థికాభివృద్ధి రేటును తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాంత్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. మైనింగ్, జియోలాజికల్ అండ్ మెటలార్జికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎంజీఎంఐ) బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్ అత్యున్నత స్థాయి వృద్ధి రేటు సాధించే స్థాయికి చేరాలంటే, అందులో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్లేషణ చేశారు. ఇంధన రంగం నిర్వహణ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైనదని వివరించారు. తలసరి ఇంధన వినియోగం విషయంలో భారత్ ప్రస్తుతం ప్రపంచ సగటులో దాదాపు మూడవ వంతు (దాదాపు 33 శాతం) ఉందని పేర్కొన్న ఆయన, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే వినియోగం ఎన్నోరెట్లు పెరగాలని పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు