తయారీ హబ్‌గా భారత్‌! | Manufacturing to Contribute 25 Percent of GDP by 2047 | Sakshi
Sakshi News home page

తయారీ హబ్‌గా భారత్‌!

Dec 13 2025 4:40 PM | Updated on Dec 13 2025 4:57 PM

Manufacturing to Contribute 25 Percent of GDP by 2047

భారత్‌ 2047 నాటికి తయారీ దిగ్గజంగా మారాలంటే.. జీడీపీలో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలని బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ (బీసీజీ), జెడ్‌47 సంయుక్త నివేదిక సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)తో దేశీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నట్టు పేర్కొంది.

ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమోటివ్‌-ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో 2047 నాటికి 25 ట్రిలియన్‌ డాలర్ల అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కాలంలో తయారీ రంగంలో భారత్‌ వృద్ధికి ఈ రంగాలు కీలకంగా మారనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటికితోడు బలమైన జీడీపీ వృద్ధి, పారిశ్రామిక మద్దతు, స్పష్టమైన విధానాలు/పెట్టుబడులతో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, టెక్నాలజీ అమలు ద్వారా సామర్థ్యాలను విస్తృతం చేయడం ద్వారా తయారీ రంగానికి బలమైన పునాదులు వేయాలని సూచించింది.

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం కోసం.. రక్షణ, ఈవీ, సెమీకండక్టర్లకు సంబంధించి ప్రాంతీయ తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. నోయిడా–చెన్నై–హోసూర్, దొలెరా కారిడార్లు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నట్టు తెలిపింది. ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తుది మార్కెట్‌ 2022లో 33 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి 117 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రక్షణ రంగానికి 2025–26లో కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉండగా, దేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో కేటాయింపులు రెట్టింపు కానున్నట్టు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement