ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.
డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలు
బీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.

కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.
ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.

తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.
ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.

డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!
వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.
ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?


