వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ | New direct selling guidelines to spur growth in sector: IDSA | Sakshi
Sakshi News home page

వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ

Sep 13 2016 1:13 AM | Updated on Sep 4 2017 1:13 PM

వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ

వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ

వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ దిశలో కేంద్రం సోమవారం కీలక చర్య తీసుకుంది.

డెరైక్ట్ సెల్లింగ్‌పై కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ దిశలో కేంద్రం సోమవారం కీలక చర్య తీసుకుంది. డెరైక్ట్ సెల్లింగ్‌కు సంబంధించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. డెరైక్ట్ సెల్లింగ్, మల్టీ-లెవిల్ మార్కెటింగ్ నియంత్రణ లక్ష్యంగా... పిరమిడ్ స్ట్రక్చర్స్, అలాగే మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధిస్తూ తాజా మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఆహారం, వినిమయ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ ‘‘డెరైక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ 2016 ఫ్రేమ్‌వర్క్’ను విడుదల చేశారు.

ఆమోదం నిమిత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు వెల్లడించారు. డెరైక్ట్ సెల్లింగ్‌ను విస్పష్టంగా ఈ మార్గదర్శకాల్లో నిర్వచించడం జరిగిందనీ, పిరమిడ్, మనీ సర్క్యులేషన్‌తో దీనికి గత వ్యత్యాసాన్ని  మార్గదర్శకాలు స్పష్టం చేశాయని తెలిపారు. దీనివల్ల మోసాల విచారణలో అధికారులు మరింత పటిష్టంగా వ్యవహరించగలుగుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెరైక్ట్ సెల్లింగ్‌లో వస్తువుల మార్కెటింగ్, పంపిణీ, అమ్మకాలతో పాటు నెట్‌వర్క్‌లో భాగంగా సేవలూ వినియోగదారులకు అందుతాయని మార్గదర్శకాలు వివరించాయి.

పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు: ఐడీఎస్‌ఏ
తాజా మార్గదర్శకాలు డెరైక్ట్ సెల్లింగ్ రంగం పటిష్ట వృద్ధికి దోహదపడతాయని సంబంధిత ప్రాతినిధ్య సంస్థ- ఐడీఎస్‌ఏ పేర్కొంది. వినియోగదారులు వాస్తవ, మోసపూరిత పథకాలను గుర్తించడానికి ఇవి వీలు కల్పిస్తాయని డీఎస్‌ఏ చైర్మన్ జితేంద్ర జగోటా తెలిపారు. ఫిక్కీ ఇటీవలి నివేదిక ప్రకారం డెరైక్ట్ సెల్లింగ్ రంగం ప్రస్తుత విలువ రూ.7,500 కోట్లు. ఐదేళ్ల క్రితం ఈ విలువ రూ.4,100 కోట్లు. 2025 నాటికి ఈ  రంగం విలువ రూ.64,500 కోట్లకు పెరుగుతుందని అంచనా, తద్వారా 14.50 లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement