దాతృత్వ నెట్‌వర్క్‌లోకి నీలేకని దంపతులు | Nellikkani couple into the philanthropic network | Sakshi
Sakshi News home page

దాతృత్వ నెట్‌వర్క్‌లోకి నీలేకని దంపతులు

Nov 21 2017 12:59 AM | Updated on Nov 21 2017 2:41 AM

Nellikkani couple into the philanthropic network - Sakshi - Sakshi

బెంగళూరు: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ కంపెనీకి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న నందన్‌ నీలేకని, ఆయన సతీమణి రోహిణి నీలేకని తాము సైతం సమాజ సేవకు సంపదను ధారపోస్తామంటూ ముందుకొచ్చారు. తమ సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తుల సమూహం ‘ద గివింగ్‌ ప్లెడ్జ్‌’లో నీలేకని దంపతులు చేరారు. ఇందుకు సంబంధించి అంగీకారం తెలుపుతూ నీలేకని రాసిన లేఖను ద గివింగ్‌ ప్లెడ్జ్‌ తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది.

‘‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన... మన కర్మలను నిర్వహించే హక్కే మనకుంది. అంతేకానీ, ఆ కర్మ ఫలితాలను నిర్దేశించే హక్కు లేదు. చేసే పనుల నుంచి ప్రతిఫలాన్ని పొందలేమన్న భయంతో అసలేదీ చేయకుండా ఉండకూడదని భగవద్గీత చెప్పిన నైతిక ధర్మం. దాన్ని అర్థం చేసుకునే అపూర్వ అవకాశాన్ని కల్పించిన బిల్, మిలిందాకు మా ధన్యవాదాలు. ఈ ఆదర్శం కోసమే మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం’’ అని నీలేకని తన లేఖలో పేర్కొన్నారు.

నందన్‌ నీలేకని, ఆయన సతీమణి రోహిణిని గివింగ్‌ ప్లెడ్జ్‌లోకి సంతోషంతో ఆహ్వానిస్తున్నానంటూ బిల్‌గేట్స్‌ ట్వీట్‌ చేశారు. గివింగ్‌ ప్లెడ్జ్‌ను బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా, వారెన్‌ బఫెట్‌ కలసి 2010లో ఏర్పాటు చేశారు. అధిక ధనవంతులను దాతృత్వం దిశగా ప్రోత్సహించేందుకు ఇది ఏర్పాటయింది. ఈ నెట్‌వర్క్‌లో మన దేశం నుంచి విప్రో అజీమ్‌ ప్రేమ్‌జీ, బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, శోభా డెవలపర్స్‌ ఎమిరటస్‌ చైర్మన్‌ పీఎన్‌సీ మీనన్‌ ఇంతకుముందే చేరగా, వీరి బాటలోనే నీలేకని దంపతులు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement