
ఆస్ట్రేలియాలో అదానీకి ఊరట
ఆస్ట్రేలియాలో వివాదాస్పద ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూప్నకు మరో ఊరట లభించింది.
► పోర్టు విస్తరణ ప్రణాళికకు ఆమోదం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో వివాదాస్పద ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూప్నకు మరో ఊరట లభించింది. అదానీకి చెందిన 6.5 బిలియన్ డాలర్ల కార్మైఖల్ బొగ్గు గనితో పాటు ఇతర ప్రాజెక్టులకు ఆసరాగా నిలిచే బొగ్గు రవాణా పోర్టు విస్తరణకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ అబాట్ పాయింట్ పోర్టు విస్తరణ కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ వ్యవస్థ అయిన గ్రేట్ బ్యారియర్ రీఫ్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ఆందోళనలు, హెచ్చరికలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
పోర్టు విస్తరణ కోసం చేపట్టే డ్రెడ్జింగ్లో భాగంగా తవ్వితీసే మడ్డి(సెడిమెంట్)ని ఏవిధంగా, ఎక్కడికి తరలిస్తారన్నది తేల్చడంతోపాటు ఇతరత్రా కఠిన షరతులకు కట్టుబడితేనే ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తాజాగా ఇచ్చిన అనుమతుల్లో ప్రభుత్వం స్పష్టీకరించింది. కాగా ప్రభుత్వ ప్రకటనను అదానీ స్వాగతించింది. తమ బొగ్గు గనుల ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి రాయల్టీలు, పన్నుల రూపంలో 22 బిలియన్ డాలర్ల ఆదాయం కూడా లభిస్తుందని అదానీ పేర్కొంది.
అనేక ప్రతిబంధకాల తర్వాత కార్మైఖల్ బొగ్గు గని ప్రాజెక్టుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, క్వీన్స్ల్యాండ్లోని గలిలీ బేసిన్లో బొగ్గు గనుల ప్రాజెక్టులు ఉన్న భారతీయ సంస్థల్లో అదానీతో పాటు జీవీకేకు కూడా తాజా అనుమతులతో ప్రయోజనం చేకూరనుదని బ్రిస్బేన్ టైమ్స్ వ్యాఖ్యానించింది.