92 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాంక్ నికర లాభం నాలుగో క్వార్టర్లో 92 శాతం క్షీణించింది. 2016–17లో ఇదే కాలంలో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.11 కోట్లకు తగ్గిందని బ్యాంక్ తెలిపిం ది. మొండి బకాయిల కేటాయింపులు భారీగా... దాదాపు మూడు రెట్లు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని తెలియజేసింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.160 కోట్ల నుంచి రూ.542 కోట్లకు ఎగిశాయి.
మొత్తం ఆదాయం మాత్రం రూ.1,606 కోట్ల నుంచి రూ.1,738 కోట్లకు పెరిగింది. ఒక్కో షేర్కు రూ.3 డివిడెండ్ను ఇవ్వనున్నామని బ్యాంకు తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.452 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.326 కోట్లకు తగ్గింది. ఆదాయం రూ.5,995 కోట్ల నుంచి రూ.6,378 కోట్లకు పెరిగింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది కనిష్టం రూ.108ని తాకింది. చివరకు 1.7% నష్టంతో రూ.111 వద్ద ముగిసింది.