ఆ కంపెనీలపై జియో సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : ఎయిర్టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్లపై రిలయన్స్ జియో సంచలన ఆరోపణలు చేసింది. ఇంటర్కనెక్ట్ రాబడిని అక్రమంగా ఆర్జించేందుకు ఈ సంస్థలు ల్యాండ్లైన్ నెంబర్లను మొబైల్ నెంబర్లుగా చూపాయని రిలయన్స్ జియో ఆరోపించింది. అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఈ టెలికాం కంపెనీలపై భారీ జరిమానా విధించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)ని కోరింది. టెలికాం నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన ఎయిర్టెల్, వొడాఫోన్, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్పై భారీ జరిమానా విధించాలని ట్రాయ్ చీఫ్ ఆర్ఎస్ శర్మకు ఈనెల 14న రాసిన లేఖలో జియో విజ్ఞప్తి చేసింది.
ఈ మూడు టెలికాం ఆపరేటర్లు పాల్పడిన మోసానికి రూ వందల కోట్లు జియోకు, ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిలిల్లిందని పేర్కొంది. ఈ స్కామ్ వెలుగుచూసిన క్రమంలో ఆయా కంపెనీలకు తాము చెల్లించిన టెర్మినేషన్ ఛార్జీలను రిఫండ్ చేసేలా చర్యలు చేపట్టాలని ట్రాయ్ను కోరింది. కాగా జియో ఆరోపణలను ఎయిర్టెల్ తోసిపుచ్చింది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జ్పై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ట్రాయ్ను తప్పుదారిపట్టించేందుకు జియో ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది.
మరిన్ని వార్తలు