ఆర్థిక మంత్రితో పారిశ్రామికవేత్తల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించేందుకు పరిశ్రమ ప్రముఖులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. మంత్రిని కలిసే వాణిజ్య ప్రముఖుల్లో ఉదయ్ కొటక్, బీకే గోయంకా, సజ్జన్ జిందాల్, అనిల్ ఖైతాన్, అజయ్ పిరమల్, సంగీతా రెడ్డి, దిలీప్ సంఘ్వి, సంజీవ్ పూరి, రిషబ్ ప్రేమ్జీలున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే చర్యలు చేపట్టడం, సిమెంట్ , ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్పై జీఎస్టీ తగ్గింపు వంటి పలు డిమాండ్లను వారు ఆర్థిక మంత్రి ముందుంచనున్నారు.
మధ్య,చిన్నతరహా పరిశ్రమల్లో సులభతర వాణిజ్యం పెంచేందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ సూచీ ఆవశ్యకతను వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిసింది. మరోవైపు ఆర్థిక వ్యవస్ధను ఉత్తేజపరిచేందుకు రూ లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ను ప్రకటించాలని కూడా పారిశ్రామికవేత్తలు మంత్రిని కోరతారని సమాచారం. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన చర్యలపై మంత్రి ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.