ఐబీఎం కొత్త మెయిల్ సర్వీస్

ఐబీఎం కొత్త మెయిల్ సర్వీస్


న్యూఢిల్లీ: ఐబీఎం సంస్థ వ్యాపార సంస్థల కోసం వెర్స్ పేరుతో కొత్త ఈ మెయిల్ సర్వీస్‌ను ఆవిష్కరించింది. ఫైల్స్ షేరింగ్, ఎనలిటిక్స్, సోషల్ మీడియాలను సమ్మిళితం చేస్తూ సంస్థల ఉత్పాదకతను మెరుగుపరచడానికి తోడ్పడే నిమిత్తం  ఈ కొత్త యాప్‌ను అందిస్తున్నామని ఐబీఎం పేర్కొంది. ఈ ఆప్‌తో కంపెనీ ఉద్యోగులు ఈ మెయిల్స్, కేలండర్స్, ఫైల్ షేరింగ్, ఇన్‌స్టంట్ మెసేజింగ్, సోషల్ అప్‌డేట్స్, వీడియో చాట్స్.... ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై యాక్సెస్ చేసుకోవచ్చని వివరించింది.



 ఈ మెయిల్స్‌లో కావలసిన కంటెంట్ ఉన్న మెయిల్స్‌ను సరిగ్గా సెర్చ్ చేసే ఫేసెటెడ్ సెర్చ్ ప్రత్యేకత ఈ వెర్స్ ఈమెయిల్ సర్వీస్‌కు ఉందని పేర్కొంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌ను అందిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, గూగుల్ ఇన్‌బాక్స్ ఈ మెయిల్ సర్వీసులకు ఇది గట్టిపోటీనివ్వగలదని నిపుణులంటున్నారు. రోజుకు 10,800 కోట్ల ఈ మెయిల్స్‌ను ఉద్యోగులు పంపుతున్నారని, దీంతో ఉద్యోగులు గంటకు 36 సార్లు తమ ఈ మెయిల్స్‌ను చెక్ చేస్తున్నారని అంచనా. అయితే వీటిల్లో 14 శాతం ఈ మెయిల్స్ మాత్రమే ముఖ్యమైనవి కావడం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top