భగ్గుమన్న బంగారం

Gold prices today hit record high - Sakshi

సాక్షి, ముంబై:  ప్రపంచ దేశాల్లో  కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడుల ప్రవాహం పుంజుకుంటోంది. దీనికి తోడు దేశీయంగా యస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో పుత్తడి ధర  శుక్రవారం కూడా భారీగా పెరిగింది. నిన్న మల్టీకమోడిటీ మార్కెట్లో 200 రూపాయిలు పెరిగిన బంగారం ధర నేడు  ఏకంగా రూ. 900 ఎగిసింది.  దీంతో 10 గ్రాముల పసిడి రూ.44,468.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తద్వారా ఎంసీఎక్స్‌లో  పసిడి ధర అల్‌టైమ్‌ హై గరిష్టాన్ని నమోదు చేసింది. గత రెండు రోజులుగా పసిడి ధరలు వెయ్యి రూపాయలకు పైగా ఎగియడం విశేషం. తరువాతి  టార్గెట్‌ 45 వేల రూపాయలని, ఇక్కడ ఈ స్థాయిని నిలదొక్కుకోగలిగితే పసిడి పరుగు మరింత వేగం అందుకుంటుందని బులియన్‌ వర్తకులు భావిస్తున్నారు. అటు గ్లోబల్‌గా కూడా 1,7000 డాలర్ల పైన స్థిరపడితే ఈ ర్యాలీ 1742 డాలర్ల వైపు పయనించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ప్రతినిధి హరీష్  తెలిపారు. అటు బంగారం ఇకపై పటిష‍్టమేనని  ఎస్‌ఎంసి గ్లోబల్ ఒక నోట్‌లో పేర్కొనడం గమనార్హం. గురువారం ఆసియా మార్కెట్లతోపాటు  అమెరికా ఇండెక్స్‌లు 3 శాతం పడిపోవడంతో అంతర్జాతీయంగాను బంగారం ధర పెరిగింది. గ్లోబల్ మార్కెట్లలో, మునుపటి సెషన్లో 2 శాతం పైగా పెరగగా నేడు  స్థిరంగా ఉన్నాయి. స్పాట్ బంగారం ఔన్సుకు  1,669.13 వద్ద స్వల్పంగా లాభపడుతోంది. వెండి 0.5 శాతం క్షీణించి ఔన్స్‌ 17.33 డాలర్లకు, ప్లాటినం 0.7శాతం నష్టంతో 858.61 డాలర్లకు చేరుకుంది.

బలహీనమైన రూపాయి, డాలరు క్షీణత, బంగారం ధరల పరుగుకు ఊతమిస్తున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం, కరోనావైరస్ వ్యాప్తి, యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణించడం లాంటి అంశాలు బంగారం ధరలు  పెరగడానికి కారణమని అబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ బన్సాల్ పేర్కొన్నారు. శుక్రవారం డాలరు మారకంలో రూపాయి 74 స్థాయి దిగువకు  పడిపోయింది. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు  కూడా భారీ పతనాన్ని నమోదు చేశాయి. 

చదవండి : బ్లాక్‌ ఫ్రైడే; సెన్సెక్స్‌1500 పాయింట్లు క్రాష్‌

రూపాయి 65 పైసలు పతనం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top