
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న మిగులు స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో ఏరోడ్రోమ్లో ’బిజినెస్ పార్క్’ ఏర్పాటు చేయడంపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) కసరత్తు చేస్తోంది. దీనిపై సుమారు రూ. 350 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ స్థల అభివృద్ధి విభాగం సీఈవో అమన్ కపూర్ తెలిపారు. ఇందులో దాదాపు పది లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్తో ఆరు భవంతులు నిర్మిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే ఒక టవర్ పూర్తయ్యిందని, అందులో కొంత భాగంలో జీఎంఆర్ గ్రూప్ సంస్థ ఒకటి కార్యకలాపాలు సాగిస్తోందని అమన్ చెప్పారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయి, అందుబాటులోకి రావడానికి మరో రెండు, రెండున్నరేళ్ల సమయం పట్టవచ్చన్నారు. పెట్టుబడిలో కొంతభాగం నిధులను అంతర్గత వనరుల ద్వారా, మిగతాది రుణ మార్గంలోనూ సమీకరిస్తున్నట్లు చెప్పారురు. సిద్ధమవుతున్న రెండో టవర్లో ఆఫీస్ స్పేస్ను లీజుకిచ్చేందుకు పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి.