ఎయిర్‌టెల్‌–టెలినార్‌ విలీనానికి డాట్‌ ఓకే!

DoT gives nod to Airtel-Telenor merger - Sakshi

న్యూఢిల్లీ: టెలికం విభాగం (డాట్‌) తాజాగా భారతీ ఎయిర్‌టెల్, టెలినార్‌ ఇండియా విలీనానికి ఆమోదం తెలిపింది. ఇరు కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలని కోరుతూ డాట్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గతవారం కొట్టేసింది. రూ.1,700 కోట్ల గ్యారెంటీ మొత్తంలో వేలం లేకుండా ఎయిర్‌టెల్‌కు కేటాయించిన రేడియో వేవ్స్‌కు సంబంధించిన వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీ రూ.1,499 కోట్లు కాగా, మిగిలిన రూ.200 కోట్లకుపైగా మొత్తం టెలినార్‌ స్పెక్ట్రమ్‌ చెల్లింపులది.

అలాగే సుప్రీం కోర్టు ఇరు కంపెనీల విలీనానికి అంగీకారం తెలియజేయాలని డాట్‌ను ఆదేశించింది కూడా. విలీనం పూర్తయితే ఏడు టెలికం సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్‌ విస్తృతి మరింత పెరుగుతుంది. దీనికి 1800 మెగాహెర్ట్‌జ్‌ బాండ్‌లో 43.4 మెగాహెర్ట్‌జ్‌ ్జ స్పెక్ట్రమ్‌ అదనంగా సమకూరుతుంది. టెలినార్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు, పశ్చిమ), అస్సాంలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎయిర్‌టెల్‌–టెలినార్‌ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది.

ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ విలీనానికి సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ:  ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ కంపెనీని విలీనం చేసుకోవడానికి వేదాంత కంపెనీకి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ కంపెనీ పునరుజ్జీవనం కోసం వేదాంత కంపెనీ రూపొందించిన ప్రణాళికకు గత నెలలో ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్‌(ఐబీసీ) కింద మొదటిసారిగా పరిష్కారమైన కేసు ఇదే. ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ కంపెనీ బ్యాంక్‌ బకాయిలు రూ.13,000 కోట్లు ఉండగా, దీంట్లో ఎస్‌బీఐ వాటా రూ.5,000 కోట్లుగా ఉన్నాయి. ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ కంపెనీకి జార్ఖండ్‌లోని బొకారోలో 1.5 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్‌ ప్లాంట్‌ ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top