చైనా షాక్‌ : తీవ్రమవుతున్న ట్రేడ్‌వార్‌

China Hits Back At Trump With 25% More Tariff On 106 US Goods - Sakshi

బీజింగ్‌ : చైనీస్‌ ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌లపై వెంటనే చైనా గట్టి కౌంటర్‌ ఇచ్చింది. 106 అమెరికన్‌ గూడ్స్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించింది. వీటిలో సోయాబీన్స్‌, ఆటోలు, కెమికల్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, కార్న్‌ ప్రొడక్ట్‌లు, అగ్రికల్చర్‌ గూడ్స్‌ ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. వీటితో పాటు విస్కి, సిగరెట్లు, పోగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల ఎద్దు మాంసం, అమెరికా ఆరెంజ్‌ జ్యూస్‌, కొన్ని రకాల ల్యూబ్రికెంట్స్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, కొన్ని రకాల గోధుమలు, కాటన్‌, ట్రక్కులు, ఎస్‌యూవీలు, కొన్ని రకాల జొన్న ఉత్పత్తులను కూడా త్వరలోనే ఈ నూతన టారిఫ్‌లు పరిధిలోకి తీసుకురానున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

2017 వరకూ ఈ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌ల మొత్తం 50 బిలియన్ల అమెరికన్‌ డాలర్లుగా ఉన్నట్లు కామర్స్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రంప్‌ నేడు విధించిన చైనీస్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లకు కౌంటర్‌గా చైనా ఈ టారిఫ్‌లను ప్రకటించింది. అమెరికాకు వెంటనే చైనా కౌంటర్‌ ఇవ్వడంతో, ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్‌వార్‌ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా విధించిన టారిఫ్‌ ఉత్పత్తుల విలువ, చైనా విధించిన టారిఫ్‌ ఉత్పత్తుల విలువ 50 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. తాము ఎవరితోనూ ట్రేడ్‌వార్‌కు సిద్ధంగా లేమని, కానీ ఇదంతా ప్రారంభించిన వారు అర్థం చేసుకోవాలని చైనీస్‌ అంబాసిడర్‌ కుయ్ టియాన్కాయ్ అన్నారు. ఉదయం నుంచి మిక్స్‌డ్‌గా ట్రేడవుతూ వచ్చిన ఆసియన్‌ మార్కెట్లు.. చైనా విధించిన టారిఫ్‌ల ప్రభావంతో ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. దాంతో పాటు యూరోపియన్‌ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైన పడింది. వెంటనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా 1 శాతం కిందకి దిగజారింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top