
2020 నాటికి భారత్ 10 శాతం వృద్ధి
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20 నాటికి 10 శాతానికి చేరుకుంటుందని సీఐఐ అంచనావేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) ఈ రేటును 8 శాతంగా సీఐఐ పేర్కొంది.
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20 నాటికి 10 శాతానికి చేరుకుంటుందని సీఐఐ అంచనావేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) ఈ రేటును 8 శాతంగా సీఐఐ పేర్కొంది. పారిశ్రామిక వేదిక విశ్లేషణాంశాలను ప్రెసిడెంట్ శోభనా కామినేని ఇక్కడ విలేకరులకు వివరించారు. ముఖ్యాంశాలు చూస్తే...
ఏడాదికాయేడాది 1 శాతం అదనపు వృద్ధి దేశంలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు దోహదపడుతుంది. మా అంచనాలు నిజమైతే ప్రతి యేడాదీ 50 లక్షల ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 37 లక్షలుగా ఉంది.
దేశంలో జీఎస్టీ అమలు, కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం వంటివి వృద్ధికి దోహదపడే అంశాలు.
పట్టణీకరణ ప్రక్రియ నిర్మాణ రంగంలో ఆర్థిక క్రియాశీలతకు దోహదపడుతుంది. దీనికితోడు వచ్చే కొద్ది సంవత్సరాలో వివిధ ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో 30 లక్షల కోట్లను మౌలిక రంగంపై ప్రభుత్వం వెచ్చించే వీలుంది. అలాగే సేవలు, పర్యాటక రంగాల్లో వృద్ధి కూడా మొత్తంగా దేశాభివృద్ధికి దోహదపడే అంశం.
వచ్చే 10 సంవత్సరాల్లో ఒక్క నిర్మాణ రంగం నుంచే మూడు కోట్ల ఉపాధి అవకాశాల సృష్టి జరిగే అవకాశం ఉంది.
2017 జూలై 1 నుంచీ ల్యాండ్మార్క్ ట్యాక్స్ సంస్కరణను అమలు చేయడానికి పరిశ్రమ సిద్ధంగా ఉంది. వచ్చే పదేళ్లలో ఒకే దేశం– ఒకే పన్ను విధానానికి కూడా సీఐఐ పిలుపునిస్తోంది.
అన్ని కార్పొరేట్ పన్నులను తగ్గించాలని సీఐఐ కోరుతోంది.