రెండో రోజూ స్తంభించిన బ్యాంకింగ్‌ సేవలు | Broken banking services for the second day | Sakshi
Sakshi News home page

రెండో రోజూ స్తంభించిన బ్యాంకింగ్‌ సేవలు

Jun 1 2018 1:15 AM | Updated on Jun 1 2018 1:16 AM

Broken banking services for the second day - Sakshi

న్యూఢిల్లీ: స్వల్ప వేతనాల పెంపును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన రెండు రోజుల సమ్మె గురువారంతో ముగిసింది. దాదాపు 10 లక్షల మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో రెండో రోజున కూడా బ్యాంకింగ్‌ సేవలు స్తంభించాయి. డిపాజిట్లు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, ప్రభుత్వ ట్రెజరీ.. మనీ మార్కెట్‌ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె ముగియడంతో శుక్రవారం నుంచి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి రానున్నాయి. సమ్మె కాలంలో చెక్కుల క్లియరింగ్‌ మినహా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్‌ వంటి ప్రైవేట్‌ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగాయి. బ్యాంకుల యాజమాన్యాల అసోసియేషన్‌ ఐబీఏ ఈసారి రెండు శాతమే వేతనాల పెంపును ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు యూనియన్లు బుధ, గురువారాల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి మొదలైన ప్రాంతాలన్ని చోట్లా ఉద్యోగులు పాల్గొనడంతో సమ్మె ’విజయవంతం’ అయిందని సమ్మెకు పిలుపునిచ్చిన యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి 80 లక్షల పైచిలుకు చెక్కుల క్లియరింగ్‌ నిల్చిపోయిందని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని శాఖలూ మూతబడ్డాయని  ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ హర్వీందర్‌ సింగ్‌ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి ప్రైవేట్‌ బ్యాంకుల్లో కూడా కొన్ని చోట్ల తమ యూనియన్లలో సభ్యత్వం గల ఉద్యోగులు ఉన్నారని, వారు సైతం సమ్మెలో పాల్గొన్నారని సింగ్‌ వివరించారు. దాదాపు 9 బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు.. యూఎఫ్‌బీయూలో భాగంగా ఉన్నాయి. మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దేశవ్యాప్తంగా  85,000 పైచిలుకు శాఖలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement