మిడ్‌క్యాప్‌ విభాగంలో మెరుగైన ప్రదర్శన

axis midcap fund review - Sakshi

యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌

గడిచిన ఏడాది కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 15 శాతం వరకు ర్యాలీ చేసింది. కానీ, ఇదే కాలంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగింది. గతంలో ప్రధాన సూచీలతో పోలిస్తే అధిక వ్యాల్యూషన్లకు చేరిన మిడ్‌క్యాప్‌ విభాగంలో ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్ధం. ప్రధాన సూచీల కంటే ఎంతో చౌకగా స్టాక్స్‌ వ్యాల్యూషన్లు ఉన్నాయి. కనుక ఈ సమయంలో నాణ్యమైన మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశం ఉంటుందని విశ్లేషకులు, నిపుణుల అంచనా. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌లో యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన ప్రదర్శన చూపుతోంది.

రాబడులు...: గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్‌ విభాగంలో నికర రాబడులు సున్నాయే. కచ్చితంగా చెప్పుకోవాలంటే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ 0.3 శాతం నికరంగా నష్టపోయింది. కానీ, యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మాత్రం ఏడాది కాలంలో 14.6 శాతం రాబడులను ఇచ్చి ఈ విభాగంలోనే ఉత్తమ పథకంగా నిలిచింది. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కేవలం 8 శాతమే వృద్ధి చెందింది. ఈ కాలంలోనూ యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ పథకం వార్షికంగా 17.3 శాతం రాబడులతో అద్భుత పనితీరు చూపించింది. అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి వృద్ధి, ర్యాలీకి అవకాశం ఉన్న కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడంలో ఫండ్‌ మేనేజర్‌ విజయవంతమైనట్టు ఇది సూచిస్తోంది. ఇక ఐదేళ్ల కాలంలోనూ వార్షికంగా 9.9 శాతం రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఈ కాలంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 8.4 శాతమే వృద్ధి చెందింది. ఈ పథకం ఫిబ్రవరి 2011న ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా 16.79 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు పంచింది.   

పెట్టుబడుల విధానాలు..
మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సెబీ నిబంధనల ప్రకారం తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఈ నిబంధనలను అనుసరిస్తోంది. ప్రస్తుతం డెట్‌ విభాగంలో 15 శాతం మేర ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, 85 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించింది. ఈక్విటీ పెట్టుబడుల్లో 79 శాతం మిడ్‌క్యాప్‌ విభాగానికి, 21 శాతం లార్జ్‌క్యాప్‌ విభాగానికి కేటాయించి ఉంది. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 42 స్టాక్స్‌ ఉన్నాయి.

ప్రధానంగా గడిచిన రెండేళ్ల కాలంలో (2018 నుంచి) మార్కెట్లలో ఎంతో అస్థిరతలు ఉన్నా కానీ, ఈ పథకం మంచి పనితీరు చూపించడానికి గల కారణాల్లో డెట్‌ విభాగానికి చెప్పుకోతగ్గ పెట్టుబడులను కేటాయించడం కూడా ఒకటి. మార్కెట్‌ అస్థిరతల్లో ఈ పథకం నష్టాల రిస్క్‌ను తగ్గించేందుకు డెట్‌ విభాగంలోకి కొంత పెట్టుబడులను మళ్లిస్తుంది. 2017 మార్కెట్‌ ర్యాలీలో ఈక్విటీల్లో పెట్టుబడులను 95 శాతం మేర నిర్వహించగా, ఆ తర్వాత 2018లో అస్థిరతలు ఆరంభం కాగానే ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను కొంత మేర తగ్గించుకుంది. అంతేకాదు మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీగా కేటాయించిన పెట్టుబడుల్లోనూ మార్పులు చేస్తుంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్, కెమికల్స్‌ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ఈ తరహా విధానాలతో ఈ పథకం తన పనితీరును మెరుగ్గా కొనసాగిస్తోంది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top