ఎస్సార్‌ స్టీల్‌కు ఆర్సెలర్‌ మిట్టల్‌ తాజా బిడ్‌ | ArcelorMittal raises bid for Essar Steel to ₹42000 crore | Sakshi
Sakshi News home page

ఎస్సార్‌ స్టీల్‌కు ఆర్సెలర్‌ మిట్టల్‌ తాజా బిడ్‌

Sep 11 2018 12:46 AM | Updated on Sep 11 2018 12:46 AM

ArcelorMittal raises bid for Essar Steel to ₹42000 crore - Sakshi

న్యూఢిల్లీ: భారీ రుణాల్లో కూరుకుపోయిన ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ సోమవారం ఉదయం తాజా బిడ్‌ దాఖలు చేసింది. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటోమో మెటల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో ఈ బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. బిడ్‌ విలువ ఎంతన్నది అధికారికంగా తెలియనప్పటికీ, ఈ మొత్తం రూ.42,000 కోట్లు ఉండవచ్చని వినిపిస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ రుణ దాతలకు తిరిగి చెల్లింపులు చేయటానికి ఆర్సెలర్‌ మిట్టల్‌ ఈ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఎస్‌ఐఎల్‌) క్రెడిటార్స్‌ కమిటీకి ఈ మేరకు సవరించిన బిడ్‌ను సమర్పించినట్లు ఆర్సెలర్‌ మిట్టల్‌ తెలియజేసింది. గత అనుబంధ సంస్థలు... ఉత్తమ్‌ గాల్వా, కేఎస్‌ఎస్‌ పెట్రోన్‌ల రూ.7,000 కోట్ల బకాయిల చెల్లింపులకు కూడా తాజా ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ ఆఫర్‌ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. సంబంధిత రూ. 7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్‌ 11లోగా చెల్లించేస్తే ఆర్సెలర్‌ మిట్టల్‌  బిడ్‌కు  పరిశీలనార్హత ఉంటుందని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.   

బకాయిలు రూ.49,000 కోట్లు...
సుమారు రూ. 49,000 కోట్ల మొండిబాకీలను రాబట్టుకునేందుకు ఎస్సార్‌ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. తొలి రౌండులో రష్యా సంస్థ న్యూమెటల్, ఆర్సెలర్‌మిట్టల్‌ బిడ్లు వేసినప్పటికీ.. డిఫాల్ట్‌ అయిన సంస్థలతో వాటి ప్రమోటర్లకు లావాదేవీలున్నాయన్న కారణంతో సీవోసీ సదరు బిడ్లను తిరస్కరించింది.

న్యూమెటల్‌లో ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటరు రవి రుయా కుమారుడు రేవంత్‌ రుయాకు  వాటాలున్నాయన్న కారణంతో ఆ సంస్థ బిడ్‌ను తిరస్కరించింది. బ్యాంకులకు బాకీ పడ్డ ఉత్తమ్‌ గాల్వా, కేఎస్‌ఎస్‌ పెట్రోన్‌లలో వాటాలు ఉన్నందున ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ తిరస్కరణకు గురైంది. దీంతో సీవోసీ రెండో విడత బిడ్లను ఆహ్వానించింది.  వేదాంత కూడా మూడవ బిడ్డర్‌గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement