ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు 

Amrapali diverted homebuyers money to Dhoni, wife firms says Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌ నకు రెరా రిజిస్ట్రేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఇంటి కొనుగోలుదార్లకు చెందిన డబ్బును  ఆమ్రపాలి గ్రూప్  అక్రమ పద్ధతుల్లో దాళి మళ్లించిన కుంభకోణం భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి సంబంధమున్న వార్త కలకలం రేపుతోంది. ధోని భార్య సాక్షికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆమ్రపాలి గ్రూప్‌ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుందని కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆమ్రపాలి మాహి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఒప్పందాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా సమర్పించిన  ఫోరెన్సిక్‌ ఆడిట్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను సుప్రీం కోర్టు అంగీకరించింది.  

2009 - 2015 మధ్య రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ .42.22 కోట్లు చెల్లించినట్లు కోర్టుకు తెలిపింది. ఈ మొత్తంలో రూ .6.52 కోట్లు అమ్రపాలి నీలమణి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించింది. మాహిగా  పేరొందిన   ధోనికి రితి స్పోర్ట్‌లో ప్రధాన వాటా ఉండగా, సాక్షి  అమ్రపాలి మాహికి డైరెక్టర్. మూడేళ్ల క్రితం వరకు ధోని ఈ బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు.  గ్రూప్ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి చాలా లావాదేవీలను నిర్వహించారని, ఇతర గ్రూప్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కూడా ధోనీ జోక్యం చేసుకున్నాడని తమ ఆడిట్ రిపోర్టులో పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా పేర్కొన్నారు. రాంచీలో ఓ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఈ సంస్థ (ఆమ్రపాలి మహి) విలీనం చేశారని,  దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఎంవోయూ కూడా కుదిరిందన్నారు. కానీ ఈ  ఒప్పంద పేపర్లు తమ దగ్గర అందబాటులో లేవని  పేర్కొన్నారు. 

ఆడిట్ నివేదిక ప్రకారం, నవంబర్ 22, 2009 తేదీన సంతకం చేసిన ఎండార్స్‌మెంట్ ఒప్పందం ప్రకారం, ధోని తనను తాను అమృపాలి గ్రూప్ ఛైర్మన్‌కు రితి స్పోర్ట్స్ ప్రతినిధితో పాటు  మూడు రోజుల పాటు అందుబాటులో  ఉండాల్సి ఉంది. దీనికి ధోనీ అంగీకరించినట్టుగా ఎలాంటి రికార్డు అందుబాటులో లేదు. అలాగే మార్చి 20, 2015 నాటి మరో స్పార్సర్‌షిప్‌ ఒప్పందం  ప్రకారం ఐపిఎల్ 2015 ఎడిషన్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కోసం వివిధ ప్రదేశాలలో "లోగో స్పేస్" ను ప్రకటించే హక్కును అమ్రపాలి గ్రూప్ సొంతం చేసుకుంది. అ ప్పుడు  ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే ఈ ఒప్పందం సాదా కాగితంపై ఉందని ,  అమ్రపాలి,  రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మాత్రమేఈ డీల్‌ జరిగింది.  ఈ ఒప్పందానికి చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంతకాలు లేవని  నివేదిక తెలిపింది.

42వేలకు  పైగా గృహకొనుగోలుదారుల డబ్బులను అక్రమంగా మళ్లించారని తాము భావిస్తున్నామని, వాటిని రికవరీ చేయాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం జూలై 23న జారీ చేసిన ఆర్డర్‌లో అభిప్రాయపడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో  అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతని ప్రభుత్వరంగ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ (ఎన్‌బీసీసి)కి అప్పగించింది. రితి స్పోర్ట్స్ పేరుతో పలు ప్రాంతాల్లో ఆమ్రపాలికి అధికారులు మంజూరు చేసిన ఆస్తుల లీజును కూడా సుప్రీం కోర్టు రద్దు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో గ్రూప్ సీఎండీ అనిల్ శర్మ, ఇతర డైరెక్టర్లను, సీనియర్ అధికారులను విచారించాలని ఆదేశించింది. ఇది ఇలా వుంటే ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులో పదేళ్ల కింద బుక్ చేసుకున్న 5,500 చ.అ.పెంట్‌హౌస్‌కు సంబంధించిన యాజమాన్య హక్కులకు రక్షణ కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సర్వీసులకు చెల్లించాల్సిన సొమ్ముతో పాటు, పెట్టుబడిగా పెట్టిన రూ.25 కోట్లు  కంపెనీ ఎగవేసిందని ఆరోపించారు.  అలాగే కంపెనీ తమకు 115 కోట్ల రూపాయల మేర బకాయి పడిందని రితి స్పోర్ట్స్‌, ధోని సంయుక్తంగా సుప్రీంను కోరాయి.   

మరోవైపు ఈ వార్తలపై   రితి స్పోర్ట్స్‌ గానీ, క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ గానీ  అధికారికంగా స్పందించాల్సి వుంది. 

 చదవండి : ఇల్లు’ గెలిచింది..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top