30 బిలియన్‌ డాలర్లకు  భారత్‌–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం  | 30 billion dollars India-Russia bilateral trade | Sakshi
Sakshi News home page

30 బిలియన్‌ డాలర్లకు  భారత్‌–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 

Mar 14 2019 12:32 AM | Updated on Mar 14 2019 12:32 AM

30 billion dollars India-Russia bilateral trade - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గతేడాది ఇండియా, రష్యా ఇరు దేశాల మధ్య 11 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని.. 2025 నాటికిది 30 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని రష్యాలోని టాంస్క్‌ రీజియన్‌ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌ఈ ఆండ్రూ ఆంటనోవ్‌ అంచనా వేశారు. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తులు, మైనింగ్, మిషనరీ బిల్డింగ్, న్యూక్లియర్, ఫార్మా, మెటల్‌ ఉత్పత్తులు భారత్‌తో పాటూ 48 దేశాలకు ఎగుమతి అవుతుంటాయని తెలిపారు. ఎగుమతుల్లో ప్రధానంగా 27 శాతం రసాయన ఉత్పత్తులు, 23 శాతం మిషనరీ బిల్డింగ్‌ ఉత్పత్తులుంటాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఎఫ్‌ట్యాప్సీ ఆధ్వర్యంలో ‘‘హై లెవల్‌ బిజినెస్‌ డెలిగేషన్‌ ఆఫ్‌ రష్యన్‌ ఫెడరేషన్‌’’ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్‌టీఏపీసీసీఐ ప్రెసిడెంట్‌ సీఏ అరుణ్‌ లుహారియా మాట్లాడుతూ.. ఏటా మన దేశం నుంచి రష్యాకు 2.1 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు, రష్యా నుంచి మన దేశానికి 8.6 బిలియన్‌ డాలర్ల దిగుమతులు జరుగుతుంటాయన్నారు. 2018–19లో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నాటికి 3.3 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని చెప్పారు. మన దేశం నుంచి రష్యాకు ప్రధానంగా ఫార్మా, న్యూక్లియర్‌ ఉత్పత్తులు, ఆర్గానిక్‌ కెమికల్స్, రైస్‌ వంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా.. మినరల్స్, ఆయిల్స్, సహజ వాయువులు, విలువైన రాళ్లు, మెటల్స్, ఎరువులు వంటివి దిగుమతి అవుతున్నాయని తెలిపారు. 

టీఎస్‌ఐఐసీలో 150000 ఎకరాల స్థలం.. 
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ ఈవీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా, ఆగ్రో, ఫుడ్‌ ప్రాసెసింగ్, టూరిజం, లాజిస్టిక్, తయారీ రంగాల్లో తెలంగాణ, టాంస్క్‌ రీజియన్‌లకు సారూప్యమైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్‌ తయారీలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్స్‌ తెలంగాణలో ఉత్పత్తి అవుతాయని.. దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్‌ డ్రగ్స్‌లో మూడింట ఒక వంతు బల్క్‌ డ్రగ్స్‌ హైదరాబాద్‌ నుంచే అవుతున్నాయని తెలిపారు. అందుకే ఈ రెండు రంగాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంల్తైనా ఉందని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ పరిశ్రమల స్థాపన కోసం 150000 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. ఫుడ్, ఆగ్రో ప్రాసెసిం గ్‌ యూనిట్ల ఏర్పాట్ల కోసం ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలతో పాటూ ల్యాండ్, వాటర్, కరెంట్‌లను ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంస్క్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ మరీనా ఉస్కోవా, రష్యా ఫెడరేషన్‌ ట్రేడ్‌ కమీషనర్‌ హెచ్‌ఈ యరోస్లావ్‌ టారాస్విక్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement