ఇంధన సబ్సిడీలకు 22,000 కోట్లు కావాలి.. | 22,000 crore to fuel subsidies | Sakshi
Sakshi News home page

ఇంధన సబ్సిడీలకు 22,000 కోట్లు కావాలి..

Feb 6 2015 12:29 AM | Updated on Sep 2 2017 8:50 PM

వంటగ్యాస్, కిరోసిన్ సబ్సిడీల కారణంగా వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ద్వితీయార్ధంలో రూ.22,201 కోట్లు ఇవ్వాల్సిందిగా చమురు శాఖ కోరుతోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెట్రోలియం శాఖ లేఖ
న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ సబ్సిడీల కారణంగా వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ద్వితీయార్ధంలో రూ.22,201 కోట్లు ఇవ్వాల్సిందిగా చమురు శాఖ కోరుతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు సబ్సిడీల భారంపై పరిహారం కింద రూ.17,000 కోట్లను చెల్లించింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఓఎంసీల ఆదాయ నష్టాల్లో(రూ.51,110 కోట్లు) ఈ మొత్తం మూడో వంతు మాత్రమే. కాగా, ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి(అప్‌స్ట్రీమ్ ఆయిల్) కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లు రూ.31,926 కోట్లను భరించాయి.

కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 50 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో ద్వితీయార్ధంలో అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు ఓఎంసీలకు ఆదాయ నష్టాల కింద ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన అవసరం లేదని కూడా పెట్రోలియం శాఖ పేర్కొంది. ఆర్థిక శాఖకు రాసిన లేఖలో ఈ వివరాలను తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత 2014-15 ఏడాదిలో ఓఎంసీలకు ఆదాయ నష్టాలు(మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇంధనాలను విక్రయించడం కారణంగా) రూ.74,773 కోట్లుగా అంచనా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement