‘ఆయనకు అందుకే మతి భ్రమించింది’ | YSRCP MLA Kakani Govardhan Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు..

Feb 25 2020 11:25 AM | Updated on Feb 25 2020 11:52 AM

YSRCP MLA Kakani Govardhan Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, నెల్లూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఊపందుకున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఆయన పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్‌ కమిటీల నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదని.. కేవలం అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలని ఆయన భావించారని విమర్శించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి పేరుతో దోపిడీ చేశారని మండిపడ్డారు. బినామీ పేర్లతో వేల ఎకరాలు భూములను కొనుగోలు చేశారని.. రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఆయన ధ్వజమెత్తారు. కేవలం అమరావతి కోసమే కొందరితో బాబు ఆందోళన చేయిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులకు పురిగొల్పుతున్నారని  గోవర్ధన్‌ రెడ్డి  ధ్వజమెత్తారు. (క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఈడీ రెడీ)

అన్ని తాత్కాలిక భవనాలని గతంలో చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు అన్నీ కట్టానని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పలు కంపెనీలకు ప్రభుత్వ భూములు చౌకగా కట్టబెట్టి వారి నుంచి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ’చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. తనను ఓడించిన ప్రజలపై కక్ష సాధించేందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చైతన్య యాత్రలకు ప్రజలు రాకపోవడంతో చంద్రబాబుకు మతి భ్రమిస్తోంది. టీడీపీ నేతలే చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ఉన్నారని’  ఎమ్మెల్యే గోవర్ధన్‌ రెడ్డి  పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement