విశాఖను దోచుకుంటున్నారు.. | YSRCP Leader Gudivada Amarnath introduces Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖను దోచుకుంటున్నారు..

Jul 9 2017 5:09 AM | Updated on May 29 2018 4:40 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గడిచిన మూడేళ్లుగా విశాఖ జిల్లాను దోచుకుతింటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గడిచిన మూడేళ్లుగా విశాఖ జిల్లాను దోచుకుతింటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ వేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా శనివారం ప్రారంమైన వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్లీనరీలో విశాఖ జిల్లా తీర్మానాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ ప్రవేశపెట్టారు. విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు సాగిస్తున్న దందాలపై ప్లీనరీలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతో సుందరమైన విశాఖను నేడు భూ కబ్జాలు, భూ దందాలు, సెటిల్‌మెంట్స్‌ కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు.

లక్షల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడమే కాకుండా ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి కాజేస్తున్నారన్నారు. ఈ కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. ఎంపీ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం ముదుపాక భూములను పరిశీలించి భూ బాధితులకు అండగా నిలిచిందన్నారు. సేవ్‌ విశాఖ అంటూ విశాఖలో నిర్వహించిన మహాధర్నాలో పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని భూ బాధితులకు భరోసా కల్పించారన్నారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నందున సిట్‌ విచారణను తక్షణమే నిలిపివేసి సీబీఐ దర్యాప్తు చేయించా లని ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు అమర్‌నాథ్‌ ప్రకటించారు.

రైల్వేజోన్‌పై ప్రకటనేది?
విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక రైల్వేజోన్‌పై మూడేళ్లయినా ప్రకటన రాలేదన్నారు. విశాఖలో ఏర్పాటు చేయకుండా వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, రైల్వే జోన్‌ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. దేశంలో మరెక్క డా దొరకని స్థాయిలో గంజాయి, మాదక ద్రవ్యాలు రవా ణాకు విశాఖ కేంద్రంగా మారిందని, ఎక్కడ గంజాయి పట్టుకున్న దాని మూలాలు విశాఖలోనే ఉంటున్నాయన్నారు.

ప్లీనరీలో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్సీలు డీఎస్‌ఎన్‌ రాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ,, పార్టీ కో ఆర్డినేటర్లు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజు, పెట్ల ఉమాశంకర గణేష్, అక్కరమాని విజయనిర్మల, బొడ్డేడ ప్రసాద్, వీసం రామకృష్ణ, శెట్టి ఫల్గుణ, జర్శింగి సూర్యనారాయణ, అరుణకుమారి, పోయా రాజారావు, పార్టీ రాష్ట్ర రాష్ట్ర జిల్లా నేతలు కొయ్యా ప్రసాదరెడ్డి, జాన్‌వెస్లీ, కంపాహనోక్, దామా సుబ్బారావు, రవిరెడ్డి, పక్కి దివాకర్, సత్తి రామకృష్ణారెడ్డి,  ఐహెచ్‌ ఫరుఖీ, తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, శ్రీకాం™Œ రాజు, పీలా వెంకట లక్ష్మి,  పసుపులేటి ఉషాకిరణ్, గరికిన గౌరి మహ్మద్‌ షరీఫ్, బర్కత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

గుడి బడి తేడా లేకుండా మద్యం దుకాణాలు
విశాఖ జిల్లాలో గుడి..బడి..అనే తేడా లేకుండా జనా వాసాల మధ్య ఇష్టమొచ్చినట్టుగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని అమర్‌నాథ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమాలు చేస్తున్నారని ప్లీనరీ దృష్టికి తీసుకొచ్చారు. వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్రపై విభజన హామీలు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపుతున్నారని గుర్తు చేశారు.

 ప్రత్యేక ప్యాకేజీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. విశాఖ గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని, మహానేత వైఎస్సార్‌ కలల ప్రాజెక్టయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిను వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన చేపట్టాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఆంత్రాక్స్, విషజ్వరాలతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తక్షణమే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని గుడివాడ ప్లీనరీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement