వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా పల్స్ తెలుసు | YSRajasekhara reddy knows public pulse | Sakshi
Sakshi News home page

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా పల్స్ తెలుసు

Aug 19 2013 3:27 AM | Updated on Mar 18 2019 7:55 PM

రాష్ట్ర విభజన వ్యవహారంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లితే సహించబోమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు.

సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజన  వ్యవహారంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లితే సహించబోమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి తుడా కార్యాలయం ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద రాజన్న దళం గర్జన పేరుతో వంటా వార్పూ కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విభజనకు తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు కారణమైతే, దానిని వైఎస్ మీదకు నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

విభజన జరిగితే, హైదరాబాద్‌కు వెళ్లడానికి వీసాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హోదాలోనే వ్యాఖ్యానించిన మొనగాడు వైఎస్ అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై బురద చల్లి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజనను మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, సోనియా గాంధీ చెవులు చిల్లులు పడేలా గర్జిస్తున్నారని అన్నారు. అవసరమైతే ప్రతి మహిళా దుర్గమ్మలా మారడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

రాష్ట్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న జగన్‌కు మహిళలు తోడుగా నిలబడుతున్నారని తెలి పారు. హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందిన 25 లక్షల మంది నివశిస్తున్నారని చెప్పారు. వీరు కాకుండా ఆరు లక్షల మంది ఉద్యోగాలు, మరో పది లక్షల మంది వ్యాపారాలు చేసుకుంటున్నారని వివరించారు. గత 60 ఏళ్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే, ఆ నగరాన్ని తన్నుకుపోతున్నారని తెలిపారు. తిరుపతి ప్రజలు గర్వపడే ఎమ్మెల్యేగా ఉంటానని గతంలో కూడా చెప్పానని, ఆ మాట మీదే ఉన్నానని గుర్తు చేశారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి సీమాంధ్రలో ఉన్న ఆదరణ చూసి, ఓర్వలేని చంద్రబాబునాయుడు సోనియా గాంధీతో కలసి విభజనకు సిద్ధపడ్డారని దుయ్యబట్టారు. విభజన జరిగితే తొలుత నష్టపోయేది తిరుపతి వాసులేనని ఆయన స్పష్టం చేశారు.

తిరుపతికి వచ్చే తాగునీళ్లు శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు. దీంతోపాటు సాగునీరు అందక సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ మాట్లాడుతూ ముందు చూపు తనకే ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడికి విభజన వల్ల కలిగే నష్టాలు తెలియవా అని ప్రశ్నించారు.  సామాజిక న్యాయం అని చెప్పుకుని గెలుపొందిన చిరంజీవి, సమన్యాయాన్ని ఎక్కడ పాటిస్తున్నారన్నారు.

రాష్ట్ర ఉద్యోగులు జీతాలు ఇవ్వక పోయినా, పస్తులకు కూడా సిద్ధపడి ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి, మహిళా కన్వీనరు కుసుమ, యువజన విభాగం కన్వీనరు ఇమామ్, నెమ్మలి పార్థసారథి, దొడ్డారెడ్డి మునీశ్వర రెడ్డి ప్రసంగించగా, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, మైనారిటీ సెల్ కన్వీనర్ ఖాద్రీ, దొడ్డారెడ్డి శంకర్‌రెడ్డి, దొడ్డారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వెంకటముని, సారథి, కల్పనతో పాటు తాతయ్య గుంట, మల్లయ్య గుంట, పెద్దకాపు వీధి, వినాయకనగర్ వార్డులకు చెందిన పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement