ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు

Published Thu, Mar 21 2019 2:03 PM

 YS Vivekananda Reddy daughter sunitha reddy meet To AP CEO - Sakshi

సాక్షి, అమరావతి : దివంగత నేత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి గురువారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిశారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని సచివాలయంలో కలిసిన ఆమె...తన తండ్రి హత్యకేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సునీతా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతల స్టేట్‌మెంట్లు ఉన్న పేపర్ కటింగ్స్‌ను సునీతారెడ్డి ...సీఈవోకు అందచేశారు. సునీతారెడ్డి తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి ఏపీ సచివాలయానికి వచ్చారు. చదవండి...(పుట్టెడు దుఃఖంలో ఉన్న మాపై తప్పుడు వార్తలా?)

అనంతరం సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్‌’పై ప్రభావం చూపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థపై సీఎం ఒత్తిడి ఉంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దర్యాప్తు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, నిన్న మీడియాతో తాను ఏం మాట్లాడానో అవే విషయాలు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇస్తామని సీఈవో తెలిపారు.’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement