మూడు ప్రాంతాలకూ సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉస్మానియా ఆస్పత్రిలోనూ కొనసాగుతోంది.
హైదరాబాద్ : మూడు ప్రాంతాలకూ సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉస్మానియా ఆస్పత్రిలోనూ కొనసాగుతోంది. ఆయనకు రక్తస్థాయి సాధారణంగా ఉన్నా, షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఎనిమిదిమంది వైద్యుల బృందం జగన్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మంచినీళ్లలోనైనా గ్లూకోజ్ కలిపి తీసుకోవాలని వైద్యులు సూచించినా ఆయన నిరాకరించినట్లు సమాచారం.
పరిస్థితి ఇలాగా కొనసాగితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆర్ఎంవో డా.రఫీ తెలిపారు. ప్రాణం పోయినా జగన్ దీక్షను కొనసాగిస్తానన్నారని వెల్లడించారు. శుక్రవారం ఉదయం డా.రఫీ మీడియాతో మాట్లాడారు. పల్స్ రేట్ తగ్గిపోతోందని, కీటోన్స్ పెరడటం ప్రమాదకరమన్నారు. జగన్కు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నివేదికలు అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని రఫీ పేర్కొన్నారు.
కాగా వైఎస్ జగన్మోహహన్ రెడ్డి ఆగస్టు 24వ తేదీ సాయంత్రం నుంచి 126 గంటలుగా చంచల్గూడ జైల్లో చేస్తున్న దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు గురువారం ప్రయత్నించారు. రాత్రి 11.45 గంటలకు ఆయనను బలవంతంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోనే జగన్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు.
మరోవైపు జగన్ను ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ...అప్పటికే ఉస్మానియాకు తరలి వచ్చారు. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.