ఆసియాలోనే చరిత్ర సృష్టించిన నేత వైఎస్సార్‌ : జగన్‌ | YS Jagan Mohan Reddy Speech In Vizianagaram | Sakshi
Sakshi News home page

ఆసియాలోనే చరిత్ర సృష్టించిన నేత వైఎస్సార్‌ : వైఎస్‌ జగన్‌

Oct 1 2018 6:36 PM | Updated on Oct 1 2018 7:13 PM

YS Jagan Mohan Reddy Speech In Vizianagaram - Sakshi

తోటపల్లి ప్రాజెక్టుకు వైఎస్‌ హాయాంలోనే 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, చంద్రబాబు  కేవలం 10 శాతం పనులు పూర్తి చేసి...

సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో ప్రభుత్వం డిగ్రీ కళాశాల లేని ఏకైక జిల్లా కేంద్రం విజయనగరమని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. గత ముప్పై ఏళ్లుగా జిల్లాలో టీడీపీ అధికారంలో ఉందని, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పదవులు అనుభవిస్తూ కనీసం డిగ్రీ కళాశాల కూడా కట్టలేక పోయారని జగన్‌ మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 275వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లాలోని మూడు లాంతర్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప‍్రసంగించారు. 2004లో వైఎస్సార్‌ సీఎం అయ్యేవరకు కూడా జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేదని.. వైఎస్సార్‌ సీఎం అయ్యాక ఐదేళ్ల కాలంలో విజయనగరం జిల్లాలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టారని తెలిపారు. విజయనగరం జిల్లాకు ప్రాధాన ప్రాజెక్టు అయిన తోటపల్లి ప్రాజెక్టుకు వైఎస్‌ హాయాంలోనే 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, చంద్రబాబు  కేవలం 10 శాతం పనులు పూర్తి చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

ఆసియాలోనే మొట్టమొదటిసారిగా జంఝావతి రబ్బర్‌ డ్యాంను నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే అని గుర్తుచేశారు. నాలుగేళ్ల టీడీపీ పాలనపై వైఎస్‌ జగన్‌ నిప్పులవర్షం కురిపించారు. ‘ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఆంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌ వైఎస్‌ హాయాంలోనే పూర్తి చేశారు. గత  ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలకు ఇచ్చారు. జిల్లాకు మెడికల్‌ కాలేజీ, స్మార్ట్‌ సిటీ, గిరిజన యూరివర్సిటీ, లలితా కళా అకాడమీ, పారిశ్రామిక నగరం అని ఎన్నో హామీలు ఇచ్చారు. నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. జూట్‌ మిల్లులు మూతపడుతున్నాయి. జిల్లాలో ఎనిమిది మిల్లులు ఉంటే చంద్రబాబు సీఎం అయ్యాక.. ఏకంగా నాలుగు జూట్‌ మిల్లులు మూతపడ్డాయి. వీటివల్ల 1200 మంది ఉద్యోగాలు కోల్పోయారు’’

జగన్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో చంద్రబాబు హాయాంలో మూతపడ్డ సహాకార రంగాలను 2004లో వైఎస్సార్‌ సీఎం అయ్యాకా 35వేల కోట్లు కేటాయించి వాటిని ఆదుకున్నారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతీసారి సహాకార రంగాలు మూతపడుతున్నాయి. లాభాల్లో ఉన్న వాటిని చంద్రబాబు నష్టాల్లోకి తీసుకెళ్లుతున్నారు. జిల్లాలో తాగు నీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో కలుషిత నీరు తాగి విషజ్వరాలు సంభవించడవంతో 86 మంది మృతి చెందారు. ఐదు లక్షల మంది జ్వరం బారీనపడ్డారు. 108 వాహనాలు పూర్తిగా మూతపడ్డాయి. వారికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉంది. జిల్లాకు ఎంతో కీలకమైన భోగాపురం ఎయిర్‌పోర్టును ఇంత వరకు పూర్తి చేయలేదు. గతంలో బీజేపీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా ఆశోకగజపతిరాజు ఉన్న సమయంలో కూడా ఎయిర్‌పోర్టు పనుల సాగలేదు. దాని కాంట్రాక్టులో అనేక అవినీతికి పాల్పడ్డారు. టెండర్లు ఎయిర్‌ ఇండియా అథారిటీ సొంతం చేసుకుంటే కమీషన్లు రావని వాటిని రద్దు చేశారు.

గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉండి కూడా గిరిజన యూనివర్సిటీగానీ, రైల్వే జోన్‌ గానీ తీసుకురాలేపోయారు. టీడీపీ ప్రభుత్వం వీటన్నింటిని కేంద్రం వద్ద తాకట్టుపెట్టింది. ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు బీజేపీతో రాజీ పడ్డారు. గతంలో అరుణ్ జైట్లీ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వారికి సన్మానాలు చేశారు. ఇప్పుడేమో హోదా కోసం దొంగదీక్షలు చేస్తున్నారు. సొంతమామానే వెన్నుపోటు పోడిచిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి వ్యక్తి మనకు సీఎంగా ఉండడం అవసరమా. నాలుగేళ్లు అధికారంలో ఉండి వేల కోట్లు అక్రమంగా సంపాందించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో చేతులు కలిపి నాపై అక్రమంగా కేసుల పెట్టించారు. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపి నాపై, నా భార్య పై అక్రమ కేసుల పెట్టాలని చూస్తున్నారు.  ఎన్నికల్లో సానుభూతి పొందాలని బాబ్లీ కేసును చంద్రబాబు తెరమీదకు తీసుకువచ్చారు. ఇలాంటి అనైతిక పొత్తులు పెట్టుకునే చంద్రబాబు పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement