కొత్తగా 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం | YS Jagan Mohan Reddy Review Meeting On Fishing Harbours At Amaravati | Sakshi
Sakshi News home page

కొత్తగా 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం: సీఎం జగన్‌

Mar 19 2020 6:11 PM | Updated on Mar 19 2020 6:35 PM

YS Jagan Mohan Reddy Review Meeting On Fishing Harbours At Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అదేవిధంగా మత్స్యకారుల కోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలని తెలిపారు. రాష్ట్రంలోని ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మత్స్యకారుల ప్రధాన వృత్తి వేట, దాని కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిషింగ్‌ హార్బర్లను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా 9 చోట్ల రెండు విడతల్లో  ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. దాదాపు రూ. 2,901.61 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల  నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఫేజ్‌ –2 హార్బర్, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో మొదటి విడత కింద రూ.1,304 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. (ఏపీలో థియేటర్లు, మాల్స్‌ బంద్‌)

అదేవిధంగా రెండో విడత కింద రూ. 1597.61 కోట్లతో మరో ఐదు చోట్ల హార్బర్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రకాశం జిల్లా వాడ్రేవు, కొత్తపట్నం, శ్రీకాకుళం జిల్లా బూదగట్ల పాలెం, ఎడ్డువాని పాలెం, విశాఖ జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ కోసం ఈ డబ్బును ఉపయోగిస్తూ.. మొత్తంగా 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడతామని సీఎం జగన్‌ తెలిపారు. డీప్‌ సీ ఫిషింగ్‌ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ సహా అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులు బదులుగా పర్యావరణ హితమైన ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని అధికారులకు వైఎస్‌ జగన్‌ సూచనలు ఇచ్చారు. (ఆ లేఖపై డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు)

Advertisement
 
Advertisement
Advertisement