అన్న వస్తున్నాడు... | YS Jagan Election Campaign In Parvathipuram | Sakshi
Sakshi News home page

అన్న వస్తున్నాడు...

Mar 27 2019 8:52 AM | Updated on Mar 27 2019 8:54 AM

 YS Jagan Election Campaign In Parvathipuram - Sakshi

అభిమాన నేత వస్తున్నారు. ప్రజాసంకల్పంతో ఈ ప్రాంత ప్రజలతో మమేకమై... ప్రతి బాధితుడి గోడు విని... అందరికీ భరోసా కల్పించి... అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్న జగనన్న కొద్ది రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలిసిన జనం ఉప్పొంగిపోయారు. ఆయనతో వేసిన అడుగులను ఇప్పటికీ పదిలంగా మదిలో దాచుకున్నారు. మళ్లీ వస్తున్న రాజన్న బిడ్డను చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముందస్తు ప్రచారం జరగడంతో ఆయన సభకు తరలి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో తనతో కలిసి అడుగులు వేసిన పార్వతీపురం ప్రజల కోసం, టీడీపీ హయాంలో పడ్డ కష్టాల నుంచి బయటపడేసేందుకు... నేనున్నానంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పార్వతీపురం వస్తున్నారు. హెలికాఫ్టర్‌లో ఉదయం 9.30 గంటలకు పట్టణానికి చేరుకుని మెయిన్‌రోడ్‌ మీదుగా రోడ్‌షో చేసుకుంటూ పాతబస్టాండ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి జగన్‌ ప్రసంగిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం వెల్లడించారు.

 
ప్రజలు, పార్టీ శ్రేణులు సిద్ధం
ఎన్నికల ప్రచారానికి జగన్‌ వస్తుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్‌ను సభాస్థలికి దగ్గర్లోనే ఏర్పాటు చేసుకున్నారు. పార్టీపై ఇష్టంతో, జగన్‌పై నమ్మకంతో వైఎస్సార్‌సీపీలో చేరాలనుకుంటున్న నేతలు ఆయనకోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రజలు మరోసారి జగన్‌కు నీరాజనాలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నేళ్లుగా టీడీపీ పాలనలో కనీసం తాగునీటికి కూడా నోచుకోలేక, బురద నీటితో కాలం వెళ్లదీస్తున్న తమ బతుకులు మారాలంటే జగన్‌ సీఎం కావాలనే నిర్ణయానికి వారు ఇప్పటికే వచ్చారు. 


తోటపల్లి ఆయన తండ్రి చలవే
2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేంద్ర పాలనా అనుమతులను తీసుకొని జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టులో 2.5 టీఎంసీల నీటిని నిల్వచేసి పాత ఆయకట్టు 64వేల ఎకరాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మరో లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పించారు. రూ. 450.23 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో పనులను పూర్తి చేయాలని నిర్ణయించి భూ సేకరణ, స్పిల్‌వే, కుడి ప్రధాన కాలువ, హెడ్‌స్లూయీస్‌ తదితర 90శాతం పనులను  పూర్తిచేశారు. నిర్వాసితుల సమస్య కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ. 772 కోట్లకు పెరిగితే వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రూ. 600 కోట్లు మంజూరు చేశారు.


బాబువన్నీ డాంబికాలు
టీడీపీ ప్రభుత్వం కేవలం రూ. 65 కోట్లు విడుదల చేసి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటోంది. నేటికీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేకపోయింది. నందివానివలస, సుంకి, పిన్నింటి రామినాయుడువలస, బాసంగి, బాసంగి, గదబవలస, దుగ్గి, బిత్రపాడు, పాతకళ్లికోట, గుణానుపురం తదితర గ్రామాలకు ఇంతవరకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదు. వృద్ధులకు, వికలాంగులకు ప్యాకేజీ కూడా పూర్తిస్థాయిలో అందించలేదు. సుమారు 200 ఎకరాలు భూ సేకరణ చేయాల్సివుండగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేకపోవడంతో 117 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ పరిధిలో పిల్ల కాలువలు ఏర్పాటు కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో సాగునీరు అందట్లేదు. 2015లో 50వేల ఎకరాలకు, 2016లో 89వేల ఎకరాలకు, 2017లో లక్షా 7వేల ఎకరాలకు, 2018లో లక్షా 10వేలు ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఇరిగేషన్‌ అధికారులు, పాలకులు ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవానికి 50వేల ఎకరాలకు మించి సాగునీరు సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. 


చెరకు రైతుల బకాయిలేవీ...
లచ్చయ్యపేట వద్ద 2002లో ఎన్‌ఎస్‌ఎఫ్‌ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలో ప్రారంభించారు. 2004లో చంద్రబాబు హయాంలో దానిని ఎన్‌సీఎస్‌ యాజమాన్యానికి రూ.21కోట్లకు విక్రయించారు. నిజానికి కర్మాగారం అసలు విలువ రూ.76కోట్లే. దాదాపు 13వేల మంది రైతులు 15 మండలాల నుంచి చెరుకును కర్మాగారానికి ఇస్తున్నారు. 
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పంటకు గిట్టుబాటు లేక నాలుగు లక్షల టన్నుల నుంచి రెండు లక్షల టన్నులకు పంట సాగు పడిపోయింది. 2016–12కి రైతులకు యాజమాన్యం రూ.2కోట్లు బకాయిలు చెల్లించాలి. 2017–18కి రూ.8 కోట్లు చెల్లించాలి. ఈ ఏడాది కూడా రైతు పంట అందించినప్పటికి రెండు నెలలు అవుతున్నా బిల్లులు చెల్లించలేదు. అయినా ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఇలాంటి దీర్ఘకాలిక, భారీ సమస్యలన్నీ జగన్‌ సీఎం అయితే పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశపడుతున్నారు. 

జంఝావతి సమస్య తీరలేదు
జంఝావతి ప్రాజెక్టును 1100 ఎకరాల భూమిని సేకరించి 1976లో నిర్మించారు. ఇంకా 1175 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రూ.5కోట్లతో వైఎస్‌ 2006లో రబ్బర్‌ డ్యాం నిర్మించారు. ఎత్తిపోతల పోతల పథకం ద్వారా 800 ఎకరాలకు సాగునీరు అందించారు. పది ముంపు గ్రామాలుండగా వాటిని తొలగించడానికి ఒడిశా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ సమస్యను ఇంతవరకూ టీడీపీ పట్టించుకున్న పాపాన పోలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement