పురపోరులో మహిళా అభ్యర్థులు విజయఢంకా మోగించారు. హోరాహోరీగా సాగిన పోరులో రాజకీయ పార్టీల తరుపున బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులు తమ సత్తా చాటారు.
చీరాల అర్బన్, న్యూస్లైన్ : పురపోరులో మహిళా అభ్యర్థులు విజయఢంకా మోగించారు. హోరాహోరీగా సాగిన పోరులో రాజకీయ పార్టీల తరుపున బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులు తమ సత్తా చాటారు. పురపాలక సంఘంలోని మొత్తం 33 వార్డుల్లో 17 వార్డుల్లో మహిళా అభ్యర్థులు విజయం సాధించగా వీటిలో 10 మంది మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ పోరులో పార్టీల తరఫున పోటీ చేసిన మహిళలు కౌన్సిలర్లుగా బరిలోకి దిగారు.
త్రిముఖ పోటీ సాగిన పురపోరులో వైఎస్సార్సీపీ బలపరిచిన వార్డుల్లో పది మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ తరఫున ఆరుగురు మహిళలు, చీరాల పరిరక్షణ సమితి తరఫున ఒకరు ఉన్నారు. మొత్తం 17 మంది మహిళా కౌన్సిలర్లు నూతన కౌన్సిల్లో పనిచేయనున్నారు. వీరందరూ తొలి ప్రయత్నంలోనే కౌన్సిలర్లుగా ఎన్నికైన వారు కాగా టీడీపీ తరఫున విజయం సాధించిన కల్లగుంట అంజమ్మ మూడోసారి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పురుషులతో పాటు మహిళలు కూడా సమాన స్థాయిలో బరిలో దిగి విజయ కేతనాన్ని ఎగురవేశారు. చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్లో 17 మంది మహిళలు కౌన్సిలర్లుగా ఉండడం ప్రత్యేకత సంతరించుకుంది.