రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహించతలపెట్టిన ‘ప్రేమోత్సవం’పై మహిళలు, యువత భగ్గుమంటున్నారు.
మహిళలు, యువత మండిపాటు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహించతలపెట్టిన ‘ప్రేమోత్సవం’పై మహిళలు, యువత భగ్గుమంటున్నారు. గురువారం ‘సాక్షి ’లో ప్రచురితమైన ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ కథనంపై విద్యార్థి, మహిళా సంఘాల నేతలు స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి పేరిట విదేశీ జంటలతో లవ్ ఫెస్టివల్ నిర్వహించడాన్ని అంగీకరించబోమన్నారు.విరమించని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని, ఐక్య కార్యాచరణతో అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇది మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడమేనని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.విమల దుయ్యబట్టారు.దీనిపై ప్రభుత్వానికి మహిళాలోకమంతా తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ బికినీలతో మహిళలను చూపడం దారుణమని విమర్శించారు.