కట్న దాహానికి గర్భిణి బలి | Woman hangs self, family alleges dowry-harassment | Sakshi
Sakshi News home page

కట్న దాహానికి గర్భిణి బలి

Dec 12 2013 12:03 AM | Updated on Mar 28 2018 10:59 AM

కట్న దాహం ఓ గర్భిణిని బలితీసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది.

ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: కట్న దాహం ఓ గర్భిణిని బలితీసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని పోచారం అన్నానగర్ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. పోలీసు లు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ములుగు మండలం పందికొండ గ్రామానికి చెందిన పసుల వెంకన్న అదే జిల్లా నల్లవెళ్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన స్వప్న(21)ను గతేడాది ఏప్రిల్ 17న వివాహం చేసుకున్నాడు. ఐదు తులాల బంగారం, రూ. మూడున్నర లక్షలు, రూ.50 వేలు విలువ చేసే సామగ్రి, ప్యాషన్ బైకును స్వప్న తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చారు. ఆరునెలల క్రితం ఉపాధి కోసం దంపతులు మండలంలోని పోచారం అన్నానగర్ కాలనీకి వచ్చారు.
 
 వెంకన్న సమీపంలో ఉన్న ఐటీసీలో హమాలీ పనులు చేస్తున్నాడు. పుట్టింటి నుంచి రూ. రూ.50 వేలు అదనపు కట్నం తీసుకురావాలని వెంకన్న కొంతకాలంగా భార్యను వేధించసాగాడు. ఇదే విషయమై మం గళవారం భార్యాభర్తలు ఇంట్లో గొడవపడ్డారు. సాయంత్రం వెంకన్న పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన భార్యకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన వెంకన్న ఇంటికి వచ్చి చూడగా స్వప్న ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే కిందికి దించి కాలనీ వాసుల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు పరిశీలించి అప్పటికే స్వప్న మృతి చెం దినట్లు నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీ సుల సమాచారంతో బుధవారం ఉద యం స్వప్న తల్లిదండ్రులు, బంధువులు అన్నానగర్‌కు వచ్చారు. వెంకన్న అదనపు కట్నం కోసం వేధించడంతోనే స్వప్న ఆత్మహత్యకు పాల్పడింద ని కన్నీటిపర్యంతమయ్యారు. భర్త వేధింపులను తమకు ఎప్పటికప్పుడు స్వప్న ఫోన్ చేసి తెలిపేదని మృతురాలి తల్లిదండ్రులు గుండెలుబాదుకున్నారు.
 
 బుధవారం మల్కాజిగిరి ఏసీపీ చిన్నయ్య ఘటనా స్థలానికి చేరుకొని బంధువులతో మాట్లాడారు. స్వప్న ఐదు నెలల గర్భవతి అని బంధువులు, కాలనీవాసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుం బీకులకు అప్పగించా రు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement