హైవే.. దిగేదాక భయమే | Wide roads .. Travels Transport authorities have not adopted the standards .. | Sakshi
Sakshi News home page

హైవే.. దిగేదాక భయమే

Nov 4 2013 2:56 AM | Updated on Oct 20 2018 6:17 PM

విశాలమైన రోడ్లు.. రవాణాశాఖ ప్రమాణాలు పాటించని ట్రావెల్స్ యాజమాన్యాలు.. వాహన చోదకుల మితిమీరిన నిర్లక్ష్య డ్రైవింగ్..

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : విశాలమైన రోడ్లు.. రవాణాశాఖ ప్రమాణాలు పాటించని ట్రావెల్స్ యాజమాన్యాలు.. వాహన చోదకుల మితిమీరిన నిర్లక్ష్య డ్రైవింగ్.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుకునే లోపే పరలోకాలకు చేరుస్తోంది. వేగవంతమైన జీవన ప్రమాణాల నేపథ్యంలో వేగం.. విలాసవంతమైన ప్రయాణాలు చివరకు విషాదం మిగుల్చుతున్నాయి. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఈ పరిస్థితికి దర్పణంగా నిలుస్తోంది. తాజా పరిస్థితితో ప్రయాణికులు కలవరం చెందుతున్నారు.
 
 జిల్లాలో 180 కిలో మీటర్ల మేర ఏషియన్ హైవే 45 ఉంది. 2003 వరకు రెండు లైన్లుగా ఉన్న జాతీయ రహదారి-5ను నాలుగులైన్లగా విస్తరించారు. దీంతో ప్రమాదాలు తగ్గుముఖం పడుతాయని అందరూ భావించారు. అయితే అందరి ఊహలను తల్లకిందులు చేస్తూ ప్రమాదాలు అనూహ్యంగా పెరిగాయి. రహదారి విస్తరణతో వాహన చోదకుల వేగం మితిమీరింది. రహదారి వెంబడి మద్యం దుకాణాలు, దాబాలు ఉండటంతో పలువురు వాహనచోదకులు మద్యం మత్తులో తూలుతున్నారు. రహదారిపై ఎక్కడపడితే అక్కడే లారీలు నిలిచిపోతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్స్ ఓల్వో బస్సులు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో మితిమీరిన వేగంతో వెళుతూ మార్గంమధ్యలో ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం జాతీయరహదారిపై మితిమీరిన వేగం వల్ల 60 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా 10 శాతం, వాహన సామర్థ్యానికి మించిన లోడ్‌తో వెళ్లడం వల్ల 10 శాతం, రహదారిపైనే వాహనాలను నిలపడం వంటి ఇతర కారణాలతో 20 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.
 
 వేగపరిమితి ఇలా..
 ఏ వాహనం ఎంత వేగ పరిమితితో వెళ్లాలో నిబంధనలు ఉన్నాయి. కాని వీటిని పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. మోటారు వాహనాల చట్టంలో వేగ పరిమితి వివరాలిలా ఉన్నాయి. మోటారు సైకిల్ గంటకు 50 కి.మీ, టాక్సీలు, మాక్సీ క్యాబ్‌లు 65 కి.మీ, బస్సులు, లారీలు 65 కి.మీ, ట్రాక్టర్ 50 కి.మీ, ఇతర వాహనాలు 30 కి.మీ వేగంతో నడపాలి. అయితే వాస్తవానికి ఓల్వో బస్సులతో పాటు కొన్ని రవాణా లారీలు సైతం 120 నుంచి 140 కిలో మీటర్ల మేర వేగంతో ప్రయాణి స్తున్నాయి.
 
 మూడేళ్లలో 510 మంది మృతి
 జిల్లాలోని ఏషియన్ హైవేపై వెంబడి మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 510 మంది మృతి చెందారు. 2011లో జిల్లా వ్యాప్తంగా 381 ప్రమాదాలు జరగగా, అందులో 172 మంది చనిపోయారు. 497 మంది క్షతగాత్రులయ్యారు. 2012లో 359 ప్రమాదాల్లో 180 మంది చనిపోగా, 451మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 412 ప్రమాదాలు చోటు చేసుకోగా 158 మంది మృత్యువాత పడ్డారు. 591మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాద గణాంకాలు అందరిని కలవర పెడుతున్నాయి.  
 
 ఏరులై పారుతున్న మద్యం
 రహదారి పక్కన దాబాలు, మద్యం దుకాణాలు కూడా ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా దాబాలు ఏర్పాటయ్యాయి. 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంది. జిల్లాలోని కావలి, వెంకటాచలం, మనుబోలు, గూడూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో సుమారు 80కు పైగా దాబాలు ఉన్నాయి. దాదాపు అన్ని దాబాల్లో మద్యం అందుబాటులో ఉంది. వాహనచోదకులు అక్కడ ఫూటుగా మద్యం సేవించి మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.
 
 రోడ్లపైనే లారీలు
 జాతీయ రహదారిపై లారీలు నిలపడం నిషేధం. నిబంధనలకు విరుద్ధంగా వివిధ కారణాలతో రహదారిపై కిలో మీటర్‌కు ఒకటి చొప్పున లారీలను నిలిపివేస్తున్నారు.  సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనచోదకులు విశ్రాంతి కోసం రోడ్లపక్కగా నిలిపి వంటా, వార్పు అక్కడే చేసుకుంటున్నారు. వివిధ కారణాలతో రాత్రి వేళల్లో రోడ్డుపైనే పలు లారీలు నిలిచిపోతున్నాయి. కనీసం సిగ్నల్ లైట్లు కూడా వేయకపోవడంతో వేగంగా వెళుతున్న వాహనాలు వాటిని గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో రహదారి మధ్యలో లారీలను, టిప్పర్లను నిలిపివేయడంపై హైవే నిర్వాహకులు, హైవే పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఏటా వందలాది మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలుస్తున్నాయి.   
 
 నిద్దరోతున్న పెట్రోలింగ్
 హైవేపై నిరంతర నిఘా ఉంచి వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు ప్రమాద సంఘటనల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్ పోలీసులు నిద్దరోతున్నారు. జిల్లా పరిధిలోని ఏహెచ్‌పై ప్రమాదాల సంఘటనల స్థలాలకు త్వరితగతిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టేందుకు మూడు హైవే పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేశారు. వీటికి కేటాయించిన వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. డీజిల్ కొరతతో అవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.  
 
 ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలంటే..
 రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే వాహనాల వేగాన్ని నియంత్రించాలి. నిర్దిష్ట వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలను పసిగట్టే రాడార్ వ్యవస్థను అభివృద్ధి పరచుకోవాలి. డ్రైవర్లు మద్యం సేవించకుండా చేయాలి. జిల్లాలోని ఏషియన్ హైవే వెంబడి ఉన్న మద్యం దుకాణాలను మూయించి వేయాలి.  డ్రైవింగ్‌లో అత్యుత్తమ శిక్షణ పొందిన వారినే జాతీయ రహదారులపై వాహనాలు నడిపేందుకు అనుమతించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement