జగన్‌తో సంక్షేమ రాజ్యం సాధ్యం

The Welfare State Is Possible With Jagan - Sakshi

బొబ్బిలి రూరల్‌ విజయనగరం : రాజన్న సంక్షేమ రాజ్యం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు(చిన్న శ్రీను) అన్నారు. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన ముందుగా గ్రామంలోని వైఎ స్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు.

అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. సంక్షేమ ఫలాలు రాజశేఖర్‌రెడ్డి అందరికీ అందించారని, పింఛన్లు, ఇళ్లు పార్టీలకు అతీతంగా పంపిణీ చేశారని, అదే చంద్రబాబునాయుడు అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, జగన్‌ అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రంలో చికిత్సచేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా పథకం అమలు చేస్తారన్నారు.

మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి తమ ఆస్తులు కాపాడుకునేందుకు, పదవి కోసం పార్టీమారారని విమర్శించారు. ఆయన రెండేళ్ల పదవీకాలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చెరకు రైతుల బకాయిలపై ఎన్‌సీఎస్‌ యాజమాన్యాన్ని నిలదీశారా....? మూడు వేలమంది కార్మికులను రోడ్డున పడేసిన జ్యూట్‌ మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించి కార్మికులను కాపాడారా...? అని ప్రశ్నించారు.

తాము పీఏలు లేని నాయకులమని, 24గంటలూ అందుబాటులో ఉంటామని, అపాయింట్‌మెంట్‌ లేకుండా కలవొచ్చన్నారు. ఎంపీ అశోక్‌ను ఎవరైనా చూసారా...? ఆయన మనకు కనిపించని నాయకుడని, బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎవరూ భయపడొద్దని, వైఎస్సార్‌సీపీలోకి రావాలని పిలుపునిచ్చారు.  బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాట్లాడుతూ తాము గతంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, మంత్రిగా సుజయ్‌కృష్ణ రంగారావు ఏమి చేశారని ప్రశ్నించారు.

ఆయన సోదరుడు బేబీనాయన యువతకు మద్యం, డబ్బులు ఇచ్చి పాడుచేస్తున్నారని, రాజకీయాలు భ్రష్టుపట్టించారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఇంటి గోపాలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తినాయుడు, పెద్దింటి రామారావు, బోను అప్పలనాయుడు, తెంటు సత్యంనాయుడు, శంబంగి వేణుగోపాలనాయుడు, అల్లాడ నగేష్, పువ్వల నరసింహులునాయుడు, అడబాల కృష్ణారావు, రేజేటి విసు, డమ్మా అప్పాజీ, పాలవలస ఉమాశంకరరావు, ఇంటిగోవిందరావు, దిబ్బగోపి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top