తెలంగాణే మా డిమాండ్ | We demand Telangana state with 10 districts | Sakshi
Sakshi News home page

తెలంగాణే మా డిమాండ్

Jan 7 2014 3:45 AM | Updated on Sep 2 2017 2:21 AM

‘తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్ర జలు ఉద్యమించారు. ఎన్నో పోరాటాలు చేశా రు. ఎంతో మంది బలిదానాలకు పాల్పడ్డారు.

దేవునిపల్లి, న్యూస్‌లైన్ : ‘తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్ర జలు ఉద్యమించారు. ఎన్నో పోరాటాలు చేశా రు. ఎంతో మంది బలిదానాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలోని నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కా బోతోంది. దీనిని అడ్డుకోవడం భావ్యం కాదు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తే ఉపేక్షించబోం’ అని వక్తలు హెచ్చరించారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలోని కర్షక్ బీఈడీ కళాశాల ఆవరణలో తెలంగాణ ‘జన శాసనసభ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘2013 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’పై చర్చించారు. టీడీఎఫ్ వైస్ చైర్మన్ ఎంఏ బాసిత్ ఈ సభకు స్పీకర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో టీడీఎఫ్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందన్నారు. చివరి దశలో ఉన్న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని కోరారు. రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని సూచించారు.
 
 ప్రజలే ఉద్యమ సారథులు
 ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమాన్ని ప్రజలే నడిపారని టీడీఎఫ్ వైస్ చైర్మన్, గొల్ల కురుమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లు చర్చకు రాకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని బీసీ ఐక్యసమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయం లో అన్ని పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 20 జిల్లాలు, 200 అసెంబ్లీ స్థానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 
 అడ్డుకుంటే ఊరుకోం
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని టీడీఎఫ్ నాయకుడు, బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రన్న హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఉద్యమాలు చేస్తే సీమాంధ్రలో పెట్టుబడిదారులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్ర ప్రాంతానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. సమైక్యంగా ఉంటే తెలంగాణకు పూర్తిగా నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సాయిలు, లంబాడి హక్కుల పోరా ట సమితి జిల్లా అధ్యక్షుడు రాణాప్రతాప్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర నాయకుడు శంకర్, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు ప్రకాశ్ యాదవ్, కామారెడ్డి జేఏసీ చైర్మన్ జగన్నాథం, కోకన్వీనర్ తిర్మల్‌రెడ్డి, ప్రతినిధులు సిద్ధిరాములు, మల్లన్న, రశీద్, మోతీలాల్, మాణిక్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement