
వైఎస్సార్ సీపీ డిమాండ్ తో ఏకీభవిస్తున్నాం: శైలజానాథ్
అసెంబ్లీలో తక్షణమే సమావేశపరచాలన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల డిమాండ్ తో ఏకీభవిస్తున్నామని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు.
హైదరాబాద్:అసెంబ్లీలో తక్షణమే సమావేశపరచాలన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల డిమాండ్ తో ఏకీభవిస్తున్నామని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. సీమాంధ్ర రాజీనామాల అంశంపై గురువారం మీడియాతో మాట్లాడిన శైలజానాథ్ అసెంబ్లీ తక్షణమే సమావేశపరచాలన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల డిమాండ్ తో తాను కూడా ఏకీభవిస్తున్నానని శైలజానాథ్ తెలిపారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా ఆలోచన చేయొద్దని ఆయన విన్నవించారు. అసెంబ్లీకి రానున్న తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించాలంటే పదవిలో కొనసాగాలని శైలజానాథ్ తెలిపారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక డిమాండుతో సీమాంధ్ర ప్రాంతంలో 57 రోజులుగా ఉధృతంగా సమ్మె సాగుతోంది. ఇంత జరుగుతున్నా.. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ రాజీనామాలపై స్పందించడం లేదు.
విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. రెండు నెలల నుంచి జీతాలను సైతం వదులుకుని, జీవితాలను పణంగా పెట్టి రోడ్లమీదే ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులు రెండు నెలల నుంచి కదలట్లేదు. రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది.