ఓటర్లూ.. జర జాగ్రత్త! | voters care elections | Sakshi
Sakshi News home page

ఓటర్లూ.. జర జాగ్రత్త!

Mar 17 2014 4:00 AM | Updated on Sep 2 2017 4:47 AM

ఓటర్లూ.. జర జాగ్రత్త!

ఓటర్లూ.. జర జాగ్రత్త!

ఓటర్లూ.. అప్రమత్తంగా ఉండండి. ఓట్ల వేటగాళ్లొస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!

చీరాల, న్యూస్‌లైన్ :  ఓటర్లూ.. అప్రమత్తంగా ఉండండి. ఓట్ల వేటగాళ్లొస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..! బంధువులంటూ కలేస్తారు.. కులమంటూ ముడిపెడతారు. అదిచేస్తా.. ఇది చేస్తానంటూ బీరాలు పలుకుతారు. అటువంటి గారడి నేతలను నమ్మొద్దు. మీ ఓటే వజ్రాయుధం. మీ ఓటుతోనే అటువంటి నేతలు నిజమెరుగుతారు. పోరాటాల పురిటిగడ్డ చీరాలను ఎందరు పాలకులు పాలించినా సమస్యల జంజాటం మాత్రం మిగిలే ఉంది. గత పాలకులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరని విషయం తెలిసిందే. పట్టణంలో పలు సమస్యలు తాండవిస్తున్నాయి.
 
  పాలకులు గొప్పగా చెప్పిన రోడ్ల విస్తరణ పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. పట్టణంలో మొత్తం 12 ప్రధాన రోడ్లు మాస్టర్‌ప్లాన్ ప్రకారం విస్తరించాల్సి ఉండగా కేవలం నాలుగు రోడ్లు మాత్రమే విస్తరించారు. అవి కూడా మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధమే. మిగిలిన ఎనిమిది రోడ్ల విస్తరణ పనుల ఉసే లేకుండా పోయింది. దీంతో అగ్గిపెట్టెల్లాంటి రోడ్లతో రాక పోకలు సాగించేందుకు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
 
 మురికి కూపాలుగా ప్రధాన రోడ్లు
 పట్టణంలోని ప్రధాన రోడ్లు మురికి కూపాలను తలపిస్తున్నాయి. రోజు వారీగా గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాల ద్వారా వచ్చే చెత్తా చెదార వేసేది ప్రధాన రోడ్లపైనే. కారంచేడు రోడ్డు, దండుబాట, కుందేరు, బైపాస్‌రోడ్లు డంపింగ్ యార్డులుగా మారాయి. ఈ రోడ్ల వెంట వెళ్లాలంటే నరకయాతనే. రామాపురం వద్ద డంపింగ్ యార్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.  
 
 గుక్కెడు నీరూ గగనమే
 పట్టణంలో నివసిస్తున్నా చాలా ప్రాంతాల ప్రజలకు గుక్కెడు మంచినీరు దొరకడం కూడా గగనమే. ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకు అందడంలేదు. ఐక్యనగర్, రామ్‌నగర్, 300 కాలనీ, శ్రీనివాసనగర్, గాంధీనగర్, యానాదినగర్ కాలనీ, శాంతినగర్ , పేరాల రెడ్డిపాలెంతో పాటు అనేక శివారు ప్రాంతాలకు మంచినీటి సదుపాయం నేటికీ లేదు.
 
  ఈ ప్రాంతాలకు పైప్‌లైన్ లేకపోవడంతో ప్రజలు మంచినీరు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. ఆ అవకాశం లేనివారు బోర్లు, బావులపై ఆధార పడుతున్నారు. పట్టణంలో ఏళ్లతరబడి అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్న పేదలకు నేటికీ సొంత గూడు లేదు.
 
 అవినీతిలో అగ్రస్థానమే
 మున్సిపాలిటీలో చిన్నపని కావాలన్నా దానికో రే టు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు అక్కడి సిబ్బంది, అధికారులు.
 
 మంచినీటి కుళాయి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇళ్లు కట్టుకోవాలన్నా, వ్యక్తిగత రుణం పొందాలన్నా, మున్సిపాలిటీలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలన్నా సిబ్బంది, అధికారులకు చేతులు తడపాల్సిందే. అందుకే ఇటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే మీ చేతుల్లో ఉన్న ఓటనే అయుధంతో కల్లబొల్లి కబుర్లు చెప్పే రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement