ఏ ముహూర్తానా ప్రభుత్వం ‘ఆధార్’ కార్డుల జారీ నిర్ణయం తీసుకుందో కానీ, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను ఆధార్ నమోదు నానా యాతనలు పెడుతోంది. ఆధార్ కార్డుల ప్రాముఖ్యం.
ఏ ముహూర్తానా ప్రభుత్వం ‘ఆధార్’ కార్డుల జారీ నిర్ణయం తీసుకుందో కానీ, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను ఆధార్ నమోదు నానా యాతనలు పెడుతోంది. ఆధార్ కార్డుల ప్రాముఖ్యం.. కార్డులు దేనికి అవసరం, దేనికి అక్కర్లేదు అన్న విషయాల్లో అధికారులకే స్పష్టత కొరవడడంతో సామాన్యులకు చుక్కలు కనపడుతున్నాయి. పండగ ముందర రేషన్డీలర్లు సరుకులు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతున్నారు. ఆధార్ కార్డు తెస్తేనే సరుకులంటూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా ఆధార్ ఇంకా పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. ప్రభుత్వ సబ్సిడీ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబరు తప్పని సరి అన్న ప్రచారం జరగడం, దీనికి తగినట్టే వంట గ్యాస్ ఏజెన్సీలు బ్యాంకు లింకేజిని కోరుతుండడం, పెన్షన్లు, ఉపకార వేతనాలు పొందే వారికీ ఆధార్ కావాల్సిందేననడంతో జిల్లాప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంలో ప్రజ ల్లో ఆధార్ నమోదు, ఉపయోగాలపై అవగాహన కల్పించి, అపోహలు పోగొట్టే ప్రయత్నం ఏదీ ఇప్పటి దాకా జరగలేదు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కొందరు మరింతగా సామాన్యులను బెదరగొడుతున్నారు.
ఆధార్ కార్డులివ్వాలంటూ కొర్రీలు..
జిల్లా జనాభా 34.82లక్షలు. ఇందులో ఇప్పటి వరకు 27.90 లక్షల మంది ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో ఎంతమందికి కార్డులు అందాయన్న విషయంలో అధికారులకే స్పష్టత లేదు. మిగతా 6.92 లక్షల మంది ఇంకా ఆధార్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రేషన్ కార్డులున్న ప్రతివారు ఆధార్ కార్డును కూడా రేషన్ డీలర్లకు సమర్పించాలన్నది ఓ నిర్ణయం. కానీ, ఆధార్ లేకుంటే రేషన్ సరుకులు ఇవ్వకూడదని ఎక్కడా, ఏ అధికారీ నిర్ణయించలేదు. వాస్తవానికి జనవరి నెల దాకా ఏ పథకానికి ఆధార్ను లింక్ చేయమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సుప్రీంకోర్టుకు కేంద్రం కూడా ఆధార్ నమోదు కేవలం ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి కాదని వివరించింది.
పభుత్వం ఇంత స్పష్టంగా ఉన్నా, ఆధార్ కార్డులంటూ కొర్రీలు పెడుతూ నానా తిప్పలు పెడుతున్నారు. జిల్లాలో చాలాచోట్ల డీలర్లు ఆధార్ను అడ్డంపెట్టుకుని వినియోగదారులకు సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు, మిగిలిన సరుకులను నల్లబజారులో అమ్ముకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం వచ్చే నెల కార్డు తీసుకురావాలని హెచ్చరిస్తూ, ఏదో దానం చేసినట్లు, దయచూపుతున్నట్లు సరుకులు ఇస్తున్నారు.
ఇవిగో... ఉదంతాలు
నల్లగొండ పట్టణంలో పలు చోట్ల రేషన్డీలర్లు ఆధార్కార్డు కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. పండగ ముందు డీలర్లు కిరికిరి పెడుతుండడంతో రేషన్కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్ బియ్యానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో బియ్యం మిగిలించుకునే పనిలో పడిన డీలర్లు వినియోగదారులను బెదరగొడుతున్నారు. పాతబస్తీ, సూపర్ బజార్, హనుమాన్ నగర్, జామ్ మసీదు, శ్రీకష్ణనగర్, అక్కచెలిమ, వివేకవర్దిని ఫంక్షన్హాల్ ప్రాంతాల్లో, మున్సిపల్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రేషన్ దుకాణాల్లో ఆధార్ లేకుండా సరుకులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు.
తుర్కపల్లి మండలం మాదాపూర్, గొల్లగూడెం, ఇబ్రహీంపట్నం, పల్లెపహాడ్, వాసాలమర్రి గ్రామాల్లో కొందరు డీలర్లు ఇదే తరహాల్లో సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
దేవరకొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రేషన్బియ్యం ఇవ్వమని పేర్కొంటుండడంతో చాలా మంది వినియోగదారులు బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నారు. పదిహేను రోజుల కిందట వినియోగదారులు కొందరు అకౌంట్ల కోసం బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగారు. దేవరకొండ పట్టణంలోని పలువురు రేషన్ డీలర్లు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తప్పక ఉండాలని, లేదంటే రేషన్ బియ్యం ఇవ్వమని ఖరాఖండిగా చెబుతున్నారు. కొండమల్లెపల్లిలో ఇదే అంశం వివాదం కావడంతో అక్కడి గ్రామసభలో ఆధార్తో సంబంధం లేకుండా రేషన్ సరుకులు ఇవ్వాలని తీర్మానం కూడా చేశారు.
సూర్యాపేట నియోజకవర్గంలో ఆధార్కార్డుల ప్రక్రియ 90 శాతం పూర్తయింది. కార్డులు రావాల్సి ఉంది. కొన్ని మండలాల్లో రేషన్డీలర్లకు ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదనే సాకుతో లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం లేదు. పెన్పహాడ్ మండలంలో 25 రేషన్ దుకాణాలు ఉండగా మాసారం, అన్నారం, చీదేళ్ల గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తమకు ఇవ్వలేదని లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు ఇవ్వడం లేదు.
దీంతో కొందరు వినియోగదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాంటి వారికి మాత్రమే సరుకులు అందిస్తున్నారు. మిగతా వారికి ఉత్తిచేతులు చూపిస్తున్నారు. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంతో పాటు కందగట్ల, పాతర్లపహాడ్ గ్రామాలలో లబ్ధిదారులకు ఆధార్కార్డు లేకపోవడంతో బియ్యం ఇవ్వవమని డీలర్లు చెప్పడంతో రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు.
చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఆధార్ లేకపోతే వచ్చే నెల నుంచి సరుకులు ఇవ్వమని గట్టిగా చెబుతున్నారు. చౌటుప్పల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో కొందరు డీలర్లు అసలు సరుకులే ఇవ్వడం లేదని సమాచారం.
కోదాడ నియోజకవర్గంలో ఆధార్కార్డుల నమోదు ప్రక్రియ కొన్ని గ్రామాలలో కొనసాగుతోంది. కోదాడ, నడిగూడెం, చిలుకూరు, మునగాల మండలాల్లో రేషన్డీలర్లకు ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ను ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. లేని వారికి ఈ ఒక్కసారి మాత్రమే సరుకులు ఇస్తామని చెప్పి పంపుతున్నారు.